కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తారా ? : కూటమి సర్కార్ పై వైఎస్ షర్మిల ఫైర్

రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి.. వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా ? అని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.

Update: 2024-09-15 08:51 GMT

దిశ వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి.. వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా ? అని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని, గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యయనం చేయాలని అనుకున్నారని, దీనిపై జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే నోరు విప్పాలని డిమాండ్ చేశారు. కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. కూటమి సర్కార్ లో భాగస్వామ్య పక్షంగా ఉండి, ఈ ఏడాది 5 కొత్త కాలేజీలైన పులివెందుల,ఆదోని,మార్కాపురం, మదనపల్లి, పాడేరుల్లో వసతులను కల్పించలేమని, నిర్వహించడం సాధ్యపడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేవని మెడికల్ బోర్డుకి లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వద్ధనుకుంటుందా అని నిలదీశారు. ఇది కూటమి సర్కారుకు సిగ్గుచేటన్నారు.

కొత్తగా 750 సీట్లు సమకూరక పోవడం మీ నిర్లక్ష్యం ఫలితమేనని విమర్శించారు. లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్ ను అగమ్య గోచరంగా మార్చారన్నారు. విద్యార్థుల ఆశలను నీరు గార్చారని, మెడికల్ సీట్లకోసం పక్క రాష్ట్రాల బాట పట్టేలా చేస్తున్నారని తప్పుబట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం పెట్టి వైసీపీ సర్కార్ మెడికల్ సీట్లను అమ్ముకుంటే, ఆ విధానాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు అదే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కొత్త మెడికల్ కాలేజీల్లో వసతులను కల్పించి, ఈ ఏడాది నుంచే వాటిని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. 


Similar News