Vizag: రేపటి నుంచి విశాఖలో ఫిజీషియన్ల సదస్సు.. హాజరుకానున్న దిగ్గజ వైద్యులు

సౌత్ జోనల్, సౌత్ మిడ్ జోనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సు ఈ నెల 20న విశాఖపట్నంలో ప్రారంభంకానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫిజీషియన్ల సంఘం అధ్యక్షులు, కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు.

Update: 2024-09-19 02:14 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: సౌత్ జోనల్, సౌత్ మిడ్ జోనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సు ఈ నెల 20న విశాఖపట్నంలో ప్రారంభంకానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫిజీషియన్ల సంఘం అధ్యక్షులు, కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. విమ్స్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజులు పాటు నగరంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరినాలో ఈ సదస్సు జరగనుందని వెల్లడించారు. సౌత్ జోన్ ఫిజిషియన్ సదస్సు విశాఖలో జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న 60 మందికి పైగా ప్రముఖ వైద్యులు ఈ మూడు రోజులు సదస్సులో ప్రసంగించనున్నట్లు తెలిపారు.

ప్రముఖ వైద్య నిపుణుల రాక..

ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలతో పాటు లక్షదీవులు, పాండిచ్చేరి నుంచి 1,100 నుంచి 1200 మంది వైద్యులు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు. ఈ సదస్సులో వైద్యులకు.. వైద్య విద్యార్థులకు వైద్య విధానంలో వచ్చిన మార్పులు, నూతన పద్ధతులు తదితర అంశాలు గురించి వివరిస్తారన్నారు. ఈ సదస్సులో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు గోల్డ్ మెడళ్లు, అవార్డులు అందజేయనున్నామన్నారు. ఈ సదస్సులో సౌత్ జోన్ నుంచి ఏఐజి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సెంథిల్ రాజప్ప, బెంగుళూర్ కి చెందిన ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సతీష్ చంద్ర తో పాటు పలు వైద్య విభాగంలో నిపుణులైన వైద్యులు హాజరుకానున్నారు


Similar News