హిందూమతాన్ని గౌరవించడం జగన్కు నచ్చదు.. శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు
హిందూ మతాన్ని, హిందూమత సంప్రదాయాలను గౌరవించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, ఆయన కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదని ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు..
దిశ, డైనమిక్ బ్యూరో : హిందూ మతాన్ని, హిందూమత సంప్రదాయాలను గౌరవించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, ఆయన కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదని ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. క్రైస్తవ భావాలు కలిగిన జగన్కు, ఆయన కుటుంబ సభ్యులకు హిందూ మతం, హిందూ సంప్రదాయాలు నచ్చవని చెప్పారు. హిందూ దేవాలయాలకు వెళ్లడానికి కూడా ఇష్టపడరని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించాల్సి ఉందని, అయితే కాలు బెణికిందనే సాకుతో జగన్ వెళ్లలేదన్నారు. హిందూ మతంపై సీఎం జగన్కు గౌరవం లేదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. ఆ మరుసటి రోజే చిలకలూరిపేటలో జరిగిన కార్యక్రమానికి ఎలా హాజరయ్యారని ప్రశ్నించారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు కానీ, సీతారాముల కల్యాణానికి కానీ భార్య భారతితో కలిసి ఒక్కసారైనా వెళ్లారా? అని ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి నిలదీశారు.