ఇసుక లేదు.. పనుల్లేవు..!

ఉచిత ఇసుక విశాఖలో బాగా ఖరీదైపోయింది. కొందామన్నా అదీ ఎక్కడా కనపించడం లేదు...

Update: 2024-08-19 03:10 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఉచిత ఇసుక విశాఖలో బాగా ఖరీదైపోయింది. కొందామన్నా అదీ ఎక్కడా కనపించడం లేదు. ప్రభుత్వం గొప్పగా చెప్పి అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా ప్రాంరంభించిన డిపోల్లో ఇసుక స్టాక్ అయిపోయింది. కొత్త స్టాక్ రావడం లేదు. దీంతో బిల్డర్లు వారిపై ఆధారపడ్డ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుకను వ్యాపారంగా మార్చారనే విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ పాలనలో విశాఖలో 12 టన్నలు ఇసుక ఖరీదు పది వేల రూపాయలు కాగా, ఉచిత ఇసుక పథకాన్ని ప్రకటించిన కూటమి ప్రభుత్వంలో పది టన్నుల లారీ ఖరీదు 20 వేల రూపాయలు కావడం గమనార్హం.

డిపోల్లో నో స్టాక్

విశాఖ జిల్లాలో భీమిలి, అగనంపూడి డిపోల నుంచి ఇసుకను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఉచిత ఇసుక విశాఖలో బాగా ఎక్కవ ధరే అయినా బిల్డర్లు పనులు ఆగకుండా ఉండేందుకు కొనుగోలు చేశారు. భీమిలి డిపోలో పది రోజుల నుంచి ఇసుక కనిపించడం లేదు. పాత స్టాక్ అయిపోవడం కొత్త స్టాక్ రావకపోవడంతో అక్కడ కార్యకలాపాలు నిలచిపోయాయి. ఇక అగనంపూడి డిపోలో నాలుగు రోజుల క్రితం స్టాక్ అయిపోయింది. అరకొరగా తెప్పించిన స్టాక్ మళ్లీ అయిపోవడంతో బిల్డర్లు స్టాక్ కోసం అశగా ఎదురుచూస్తున్నారు. అగనంపూడి డిపోలో అరకొరగా లభ్యమవుతున్న ఇసుక తెచ్చుకోవాలంటూ లారీ పెట్టి మూడు నాలుగు రోజులు ఎదురు చూడాల్సవస్తుంది. దీంతో లారీ బాడుగ తడిసిమోపెడు అవుతుంది.

పనులు ఆగిపోయాయి

దీంతో, విశాఖ నగరంలో భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమాలు ఇటీవలే కాస్త పుంజుకొన్నాయి. రాష్ర్టంలో పెద్ద నగరమైన విశాఖ భవిష్యత్ బాగుంటుందన్న నమ్మకంతో పెద్ద బిల్డర్లు బడా ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇక్కడ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నందున నిజానికి ఈ రెండు స్టాక్ పాయింట్లు సరిపోవని బిల్డర్లు చెబుతున్నారు. డిమాండు కు తగ్గట్టుగా మరో నాలుగు స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయాలని అంటున్నారు.

ఒడిశా ఇసుకే దిక్కు

ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక అయిపోవడంతో విశాఖలోని బిల్డర్లు మరో గత్యంతరం లేక పక్కనున్న ఒడిశా రాష్ర్టం నుంచి అక్రమంగా వచ్చే ఇసుకపై ఆధారపడాల్సి వస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా సరిహద్దుల్లోని ఒడిశా నుంచి ఇసుకు వస్తంది. విశాఖ నగర శివారు ప్రాంతాలకు అర్ధరాత్రి పూట పెద్ద లారీల్లో అక్రమంగా తీసుకువచ్చే ఈ ఇసుకను ఇక్కడి బిల్డర్ల అవసరాలకు తగ్గట్టుగా చిన్న లారీల్లో పంపుతున్నారు. పది టన్నుల లారీకి ఇరవై వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉచిత ఇసుక ధరలు కూడా ఇంచుమించు ఇలాగే వుండడంతో బిల్డర్లు తేలిగ్గా దొరికే ఒడిశా ఇసుక వైపే మొగ్గు చూపుతున్నారు.

అధికారుల సమన్వయ లోపం

సకాలంలో ఇసుకను విశాఖకు రప్పించాల్సిన అధికారులు సమన్వయలోపంతో బిల్డర్లను ఇబ్బందులు పాల్జేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారు. ఉన్న స్టాక్, రోజువారీ డిమాండులను అంచనా వేసి కొత్త స్టాక్ తెప్పించడంలో విఫలమవుతున్నారు. విశాఖ డిమాండ్ ను ప్రభుత్వ ద్రుష్టికి తీసుకువెళ్లి ఇతర డిపోల నుంచి స్టాక్ తెప్పించే ప్రయత్నాలు ఏమీ చేయకపోవడం సమస్యలు తెచ్చిపెడుతోంది. పలువురు బిల్డర్లు ఇసుక కొరత విషయాన్ని ప్రజా ప్రతినిధులు ద్రుష్టికి తీసుకువెళుతున్నారు. అయితే, వారు కూడా చూద్దాం చేద్దాం అంటూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అవస్ధలు పడుతున్నారు.


Read more...

ఏపీ ప్రభుత్వమే ఫైన్ వేస్తే మంచిదేమో..! 



Tags:    

Similar News