Lanka Dinakar : సమ్మిట్‌కి ముందే భూదందా

జగన్ ప్రభుత్వంలో సమ్మిట్‌కు ముందే తమ అనునాయూలతో పెట్టుబడులు పెట్టించేందుకు పెద్ద లాలూచీ జరిగిందని బీజేపీ రాష్ట్ర పొలిటికల్ ఫీడ్ బ్యాక్ ప్రముఖుడు లంక దినకర్ ఆరోపించారు...

Update: 2023-03-08 10:38 GMT

దిశ, ఉత్తరాంధ్ర: జగన్ ప్రభుత్వంలో సమ్మిట్‌కు ముందే తమ అనునాయూలతో పెట్టుబడులు పెట్టించేందుకు పెద్ద లాలూచీ జరిగిందని బీజేపీ రాష్ట్ర పొలిటికల్ ఫీడ్ బ్యాక్ ప్రముఖుడు లంక దినకర్ ఆరోపించారు. ఉత్తరాంధ్రలో హైడ్రో, సోలార్ ప్రాజెక్టు‌లను హస్తగతం చేసుకోడానికే సమ్మిట్ నిర్వహించారని ఆయన వ్యాఖ్యానించారు. తన అనూనూయులకు ప్రాజెక్ట్‌ల కోసం భూములను కట్టబెట్టేందుకు అర్హులైన వారిని తొక్కేశారని మండిపడ్డారు. హైడ్రో, సోలార్ ప్రాజెక్టు‌లతో 8లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటున్నారని, దీనికి ముందుకొన్ని లాలూచీలు, భూ దందాలు జరిగాయి అని ఆరోపించారు. ఆర్ధిక సామర్ధ్యంలేని షిరిడీ సాయి ఇంజనీరింగ్ కంపెనీ గతంలో ఇండోసెల్ కంపెనీ పేరుతో ఏర్పాటైన సంస్ధ గుర్తు చేశారు. రూ. 35 కోట్లు మూలధనం మాత్రమే కలిగిన కంపెనీకి 7,200 మెగావాట్ల ప్రాజెక్టుకు అప్పనంగా దోచి పెట్టడంలో అర్ధమేంటని దినకర్ ప్రశ్నించారు. ఇండోసెల్ 10 లక్షల ఆధరైజ్డ్ కేపిటల్ కలిగి ఉన్న కంపెనీ ప్రతిపాదన చేసిన నెలలోపే ఎలా ఒప్పందానికి వస్తారని నిలదీశారు. భూముల కోసమే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ గొంతెమ్మ కోరికలు కోరిందని తెలిపారు. 2 లక్షల 50 వేల ఎకరాలు లీజుకు కావాలని, ఎకరా 3 లక్షల చొప్పున భూమి కొనుక్కోడానికి ఒప్పందాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. పెట్టుబడి సామర్ధ్యంలేని కంపెనీలకు బ్యాంక్ గ్రౌండ్ ఎవరున్నారన్నారు. అవసరమైన మేరకు అటవీ భూములను ఇవ్వాలని, దారాదత్తం చేయాలని ప్రభుత్వం రాయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు..

జీవోలు ఇచ్చాక సమ్మిట్‌లో ఎంవోయూ చేసుకున్న పరిస్ధితి ఇక్కడే చూస్తున్నామని లంకా దినకర్ తెలిపారు. 2021 నుంచి ఈ తతంగాలు నడిచాయన్నారు. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ రెండేళ్ల క్రితం 7 ప్రాజెక్టులను ఏపీలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిందన్నారు. 45 ఏళ్ల అనుభవం ఉన్న ప్రభుత్వ సంస్ధ ప్రతిపాదనను ఎలా తోసిపుచ్చుతారని ప్రశ్నించారు. దాదాపు ఏడాది తర్వాత ఎన్‌హెచ్ పీసీపీ 3-1-2023న జవాబు ఇస్తూ ప్రైవేటు కంపెనీ‌లకు ఇచ్చేశామని చెప్పడం దారుణమన్నారు. వ్యవహార దక్షత లేని వారికి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు‌లు ఎలా కేటాయిస్తారన్నారు. ఎన్‌హెచ్‌పీసీని తొక్కేసి ప్రైవేటు కంపెనీలకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. 31,500 కోట్లు సామర్ధ్యం కలిగిన ఎన్‌హెచ్ పీసీని ఎలా పక్కన పెడతారని ప్రశ్నించారు. ఏజెన్సీ‌లో గ్రీనరీ అనేది లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వనరులను దోచుకోడానికి రెన్యువబుల్ ఎనర్జీ పేరు వాడతారా అని లంకా దినకర్ ప్రశ్నించారు.

Tags:    

Similar News