Sarada Peetham:శారదా పీఠానికి మరో ఎదురు దెబ్బ!

చినముషిడివాడ లోని శారదా పీఠానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. పీఠానికి చెందిన సుమారు 20 సెంట్లు భూమి గడ్డ స్థలంలో ఉందని పెందుర్తి ఎమ్మార్వో ఎం.ఆనంద్ కుమార్ ప్రకటించారు.

Update: 2024-10-25 08:51 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:చినముషిడివాడ లోని శారదా పీఠానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. పీఠానికి చెందిన సుమారు 20 సెంట్లు భూమి గడ్డ స్థలంలో ఉందని పెందుర్తి ఎమ్మార్వో ఎం.ఆనంద్ కుమార్ ప్రకటించారు. ఇదే విషయమై ఆయన తమ కార్యాలయంలో శుక్రవారం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఫిర్యాదు ప్రకారం రికార్డులు పరిశీలించిన అనంతరం శారదా పీఠానికి చెందిన కొంత భూమి గడ్డ స్థలంలో ఉందన్నారు. అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారం తనకు లేదని తమ పై అధికారులు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామన్నారు. విషయం సున్నితమైనది కావడంతో పై అధికారుల దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు.

శారదా పీఠం భూమి గడ్డలో ఉందని ఎమ్మార్వో ప్రకటించిన నేపథ్యంలో బి.వి.రామ్ మీడియాతో మాట్లాడుతూ.. శారదా పీఠం అక్రమాలపై మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుస్తామన్నారు. శారదా పీఠంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకూడదని తెలుగు శక్తి ప్రధాన ఉద్దేశం అన్నారు. అయితే శారదా పీఠం కేవలం వైసీపీ పీఠం అని వ్యాఖ్యానించారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శారదా పీఠానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారని.. ప్రత్యేకంగా శారదా పీఠానికి వచ్చి స్వామీజీ ఆశీస్సులు పొందేవారన్నారు.

తీరా అధికారం కోల్పోయిన తర్వాత శారదాపీఠం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. నిన్న విజయనగరం పర్యటన కోసం వచ్చిన వైఎస్ జగన్ శారదా పీఠానికి రాకపోవడం అతని నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడంతో.. ఇప్పుడు ఆ వైసీపీ నాయకులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. ఏది ఏమైనప్పటికీ శారదా పీఠం ఇప్పటికే భీమిలిలో భూములు కోల్పోయిందని, తిరుమలలో భూములు కోల్పోయిందని, ఇప్పుడు ఇక్కడ కూడా భూమిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని రామ్ పేర్కొన్నారు.


Similar News