టీడీపీ బలహీనతలే వైసీపీ బలం

నాలుగేళ్ల పాలన తర్వాత ఏ ఏ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది అధికార వైసీపీ లెక్క చేయనట్లు కనిపిస్తోంది. ఇప్పటిదాకా తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం పైనే దృష్టి పెట్టింది.

Update: 2023-06-03 03:10 GMT

దిశ, ఏపీ బ్యూరో: నాలుగేళ్ల పాలన తర్వాత ఏ ఏ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది అధికార వైసీపీ లెక్క చేయనట్లు కనిపిస్తోంది. ఇప్పటిదాకా తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం పైనే దృష్టి పెట్టింది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, కౌలు రైతులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, స్థానిక ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు, మద్యం ప్రియులు, అర్బన్‌లో మధ్య తరగతి యువత, మహిళల్లో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ వర్గాలను సంతృప్తి పరచడం కన్నా గ్రామీణ పేదలు, రైతు కుటుంబాలు, మహిళల్లోకి ప్రభుత్వం అమలు చేస్తోన్న నగదు బదిలీ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి కుటుంబం వద్దకు వైసీపీ తీసుకెళ్తోంది. ఇంత సంక్షేమం, అభివృద్ధిని ఇచ్చిందా? అంటూ గత ప్రభుత్వంతో పోల్చి అడుగుతున్నారు. అలా వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తమయ్యేట్లు ఆలోచనలో పడేస్తున్నారు.

మినీ మేనిఫెస్టోలో హామీలకే ప్రాధాన్యం

ఎటొచ్చీ ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసి పట్టుకోవడంలో టీడీపీ వైఫల్యం కనిపిస్తుంది. గ్రామ పంచాయతీలను జన్మభూమి కమిటీలతో తమ హయాంలోనే నిర్వీర్యం చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. దీనిపై మహానాడులో కనీసం ప్రస్తావించడానికి టీడీపీ సాహసించ లేకపోయింది. అలాగే కౌలు రైతులను కూడా నాడు టీడీపీ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం కౌలు చట్టాన్ని మరింత లోపభూయిష్టం చేసి వాళ్లకు తీరని అన్యాయం చేసింది. వీళ్లను ఎలా ఆదుకుంటామనేది మహానాడులో చర్చకే రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంట్రాక్టు, అవుట్​ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి అసలు ప్రస్తావనే లేదు. మినీ మేనిఫెస్టోలో హామీలకే ప్రాధాన్యమిచ్చారు. ఇలా ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్న వర్గాలను ఓట్ల రూపంలో మల్చుకునేలా టీడీపీ వ్యూహం కనిపించలేదు. ఇదే వైసీపీకి ఏనుగంత బలాన్ని చేకూర్చుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రెబల్స్‌పై గురి పెట్టిన అధికార పార్టీ

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఆయా పార్టీల ఓట్లు క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల మధ్య ఏమేరకు బదలాయింపు అవుతాయనే దానిపై వైసీపీ దృష్టి సారించింది.. దీనిపై పెద్ద ఎత్తున నిఘా పెట్టింది. సీట్ల పంపకాలతో ఎక్కడెక్కడ రెబల్స్ ముందుకొస్తారు.. వాళ్ల పట్ల ఎలాంటి వైఖరి తీసుకోవాలనే అంశాలపై లోతుగా కసరత్తు చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా ఉప్పు నిప్పులా క్యాడర్ పరస్పరం కాలు దువ్వుకున్నారు. ఇప్పుడు పై స్థాయిలో నాయకులు కలిసినా కింద స్థాయిలో కార్యకర్తలు ఐక్యంగా ఏమేరకు పనిచేస్తారనే దానిపై వైసీపీ పరిశీలిస్తోంది. ఆ రెండు పార్టీల్లోని అసంతృప్తులపై ఓ కన్నేసి ఉంచారు. టీడీపీ, జనసేన పొత్తుతో తలెత్తే విభేదాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఎలాగైనా సరే ఈసారి అధికారాన్ని చేపట్టగలమనే ధీమాతో సీఎం జగన్ దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Also Read...

Ap News: పొత్తుకే ‘పశ్చిమ’ పట్టం.. టీడీపీ, జనసేన గెలిచే సీట్లు ఎన్నో తెలుసా? 

Tags:    

Similar News