యూపీఎస్సీ పోటీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ

యూపీఎస్సీ ఈ నెల 7న నిర్వహించబోతున్న ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Update: 2024-07-04 13:27 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:యూపీఎస్సీ ఈ నెల 7న నిర్వహించబోతున్న ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, సూపర్ వైజర్లతో డిఆర్ఓ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పర్సనల్ అసిస్టెంట్స్, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ ఐసీ) నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు ఈ నెల 7వ తేదీన జరుగనున్నాయని తెలిపారు. ఈపీఎఫ్ఓ పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 గం.ల వరకు, ఈఎస్ఐసీ పరీక్ష మధ్యాహ్నం 2.00 నుంచి 04.00 గం.ల వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 5,729 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు.

అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకురావాలన్నారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచెస్, ఇతర స్మార్ట్ పరికరాలు తీసుకురాకూడదని చెప్పారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రం లోనికి అనుమతించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. పరీక్ష సమయానికి అరగంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖాధికారులకు తెలిపారు. తాగునీరు వంటి సదుపాయాలతో పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పరీక్షల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, విద్యుత్, ఆర్టీసీ, జీవీఎంసీ, పోలీస్ , రెవెన్యూ , పోస్టల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News