Stamp papers: నిలిచిన స్టాంప్ పేపర్ల సరఫరా.. రిజిస్ట్రేషన్లతో తప్పని ఇబ్బందులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్టాంప్ పేపర్ల సరఫరా నిలిచిపోయింది.
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్టాంప్ పేపర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో ల్యాండ్, ఇండ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. సాధారణంగా రాష్ట్రానికి స్టాంప్ పేపర్ల సరఫరా ఎక్కువగా నాసిక్లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నుంచి సరఫరా అయ్యేవి. అప్పుడప్పుడు హైదరాబాద్లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చేవి. అయితే, గత ప్రభుత్వం నాసిక్ ప్రెస్ నుంచి రూ.90 కోట్లు విలువైన రూ.50, రూ.100 స్టాంపులను తెప్పించి అందుకు సంబంధించిన బిల్లులను నేటికి చెల్లించ లేదు. స్టాప్ పేపర్ల సరఫరా అక్కడి నుంచి పూర్తిగా నిలిచిపోయింది. అనంతరం ఇండ్లు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ల కోసం హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి నుంచి రూ.10, రూ.20 స్టాంప్ పేపర్లు తెప్పించగా అందుకు సంబంధించి రూ.20 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో పెండింగ్ బిల్లుల్లో సగానికి పైగా చెల్లిస్తేనే స్టాంప్ పేపర్లు సరఫరా చేస్తామని ఆ రెండు ప్రాంతాల సెక్యూరిటి ప్రింటింగ్ ప్రెస్ అధికారులు చెబుతున్నారు.