జీతాలు ఇవ్వండి మహాప్రభో....!

26 జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నక్రీడా శిక్షకులకు ఆరు నెలలుగా జీతాలు లేక అల్లాడిపోతున్నారు...

Update: 2024-08-18 05:23 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 100 మంది క్రీడా శిక్షకులకు (కోచ్) గత ఆరు నెలలుగా జీతాలు లేక అల్లాడిపోతున్నారు. ఎంత మంది అధికారులను కలిసిన, ధర్నా నిర్వహించిన పట్టించుకునే నాధుడే లేడు. ఆరు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని పలువురు శిక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం శాప్ లో 100మంది ఔట్ సోర్సింగ్ శిక్షకుల నియామకానికి జీఓ జారీ చేశారు. ఆ జీఓలో కాలపరిమితి 4 సంవత్సరాలు ఇవ్వడంతో అది కాస్తా ఆరు నెలల క్రీతం గడువు ముగిసింది. ఆ జీఓ గడువు ముగుస్తున్న సమయంలో ప్రభుత్వానికి జీఓ పునరుద్ధరణకు అనుమతి కోరడంలో శాప్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జీఓ పునరుద్ధరణ జరగకపోవడంతో శిక్షకుల జీతాలు నిలుపుదల చేశారు. ఈలోపు శాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బదిలీ కావడం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రద్యుమ్న ఇంచార్జ్ ఎండీ గా ఉండడం జరిగింది.

అయినప్పటికీ శిక్షకుల జీఓ పునరుద్ధరణ విషయంలో నిర్లక్ష్యం చేయడంతో ఐదు నెలలు గడిచింది. శిక్షకులు ధర్నా చేయడంతో స్పందించిన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రద్యుమ్న హుటాహుటిన జీఓ పునరుద్ధరణ చేస్తూ 100 మంది కోచ్‌ల సేవలను ఒక సంవత్సరం (3.3.24 నుండి 2.3.25) పాటు పొడిగించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. జీఓ ఇచ్చి సుమారు నెలరోజులు గడుస్తున్నా జీతాలు వచ్చిన దాఖలాలు లేవని శిక్షకులు ఆవేదన చెందుతున్నారు. ఇచ్చిన జీఓలో అప్పుడే ఆరు నెలలు ముగిసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు, రేపు అంటూ ఆరు నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్నామని పట్టించుకునే నాధుడే లేడని వాపోతున్నారు. జీఓ వచ్చిన జీతాలు ఎందుకు రావడం లేదని వాకబు చేయగా సి.ఎమ్.ఎఫ్.ఎస్ ఖాతాలో నిధులు లేవని, ప్రభుత్వం విడుదల చేసేంతవరకు వేచిచూడాలని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారని శిక్షకులు మండిపడుతున్నారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News