తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ దర్యాప్తు బ్రేక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-01 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందా లేదా వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) సోమవారం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి ధర్మాసనం.. విచారణను 3వ తేదీ వరకు వాయిదా వేసింది. అలాగే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేయాలా..? లేదా..? అనే విషయంపై కూడా అప్పుడే క్లారిటీ ఇస్తామని వ్యాఖ్యానించడమే కాకుండా సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు (మంగళవారం) కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు సిట్‌ దర్యాప్తు (SIT Investigation)ను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. కోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తునకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నామని, ఈ నెల 3వ తేదీన సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత దాని ఆధారంగా ముందుకెళ్లడం జరుగుతుందని ఆయన ప్రకటించారు.

ఇదిలా ఉంటే తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ అయిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యస్వామితో పాటు టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీసుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది.


Similar News