ప్రధాని మోడీ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా ఫైర్

కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీపీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అయ్యారు.

Update: 2024-10-10 10:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ పట్ల  ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీపీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ను విద్వేషాల ఫ్యాక్టరీ అని మోడీ అనడం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పై మోడీ విమర్శల తీరు పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించిన తీరుగా ఉందని విమర్శించారు. ఈ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టి కుల,మతాల మధ్య చిచ్చు పెట్టి విభజన రాజకీయాలు చేసేది బీజేపీనే అని దుయ్యబట్టారు. కుట్ర రాజకీయాలకు కేరాఫ్ బీజేపీ అని, మత రాజకీయాలకు జన్మస్థలం ఆ పార్టీయేనన్నారు. మతాన్ని కవచంలా అడ్డుపెట్టుకుని దర్జాగా దేశాన్ని దోచుకుంటుందని, దోస్తులకు దేశ సంపదను దోచిపెడుతుందన్నారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుంది హర్యానాలో బీజేపీ విజయమని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా.. ప్రజల మనసులో బలంగా నాటిన ప్రేమ, ఐక్యత సందేశం క్రమంగా ఉద్యమంగా, ఉప్పెనగా మారుతోందని బీజేపీకి తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ మనుషుల్ని, వారి మనసులను గెలిచిందని గ్రహించాలని, నఫ్రత్, మొహబ్బత్ కు మధ్య జరిగిన యుద్ధంలో ప్రేమనే గెలిచిందన్నారు. జమ్మూకాశ్మీర్ లో తెరుచుకున్న "మొహబ్బత్ కి దుకాణ్" లు రేపు దేశం మొత్తం తెరుచుకుంటాయని జోస్యం చెప్పారు.

మోడీ హఠావో..దేశ్ బచావో నిజమవుతుందని, 10 ఏళ్లుగా దేశం వెలుగుతుందని ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, విశ్వగురువు కాదు.. విష పురుగు" అని ప్రజలకు అర్థం అవుతుందన్నారు. విద్వేషాన్ని పెంచేది మోడీ..ప్రేమను పంచేది రాహుల్ అని స్పష్టం అవుతుందని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తుంటే, ఎదిరించిన గొంతుకలను, నక్సల్స్, టెర్రరిస్టులు, హిందూ వ్యతిరేకులుగా పోల్చుతుంటే, హక్కుల పరిరక్షణకు, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని దేశం నమ్ముతుందన్నారు. ఈ నమ్మకమే 2029లో దేశాన్ని కాంగ్రెస్ నిలబెడుతుందని, ప్రధానిగా రాహుల్ గాంధీని దేశం చూడబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ అందించేది ఆపన్న హస్తం, వాడిపోవటానికి అతి చేరువలో ఉన్నది కమలం పార్టీ అని వ్యాఖ్యానించారు. 


Similar News