తెలుగు రాష్ట్రాల్లో పోటీపై పవన్ కల్యాణ్ ఫోకస్: ఈనెల 27న అమిత్ షాతో భేటీ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుపై ఏదోఒకటి తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా?

Update: 2023-10-24 11:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుపై ఏదోఒకటి తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా? ఇప్పటికే ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ తెలంగాణలోనూ పొత్తును కొనసాగించే అంశంపై క్లారిటీ ఇచ్చే పనిలో జనసేనాని ఉన్నారా? ఇప్పటికే పొత్తు కోరుతూ తెలంగాణ బీజేపీ అధిష్టానం తీసుకువచ్చిన ప్రతిపాదనపై బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించనున్నారా? ఏపీలో పొత్తు ప్రతిపాదనపైనా ఏదో ఒక క్లారిటీ తీసుకువచ్చేందుకు పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ సన్నద్ధమవుతున్న తరుణంలో బీజేపీ అధిష్టానం పొత్తు ప్రతిపాదనను తీసుకువచ్చింది. దీంతో సీట్ల సర్ధుబాటు, ఉమ్మడి కార్యచరణ వంటి అంశాలపై జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ అగ్రనాయకత్వం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అటు ఏపీలో పొత్తులో ఉన్న నేపథ్యంలో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లే అంశంపై కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 27న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీతో పొత్తు, వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పొత్తులపై ఏదో ఒకటి తేల్చుకునే యోచన

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను దశలవారీగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగుల వేస్తోంది. తెలంగాణలో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌లు పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరు పొత్తుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే పొత్తు విషయంలో పార్టీ నేతలతో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ తెలియజేశారు. ఇకపోతే తెలంగాణ జనసేన నేతలు సైతం ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కనీసం 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే బెటర్ అని నాయకులు సూచిస్తున్నారు. అంతేకాదు ఆ 32 నియోజకవర్గాల జాబితాను సైతం జనసేన సిద్ధం చేసుకుంది. అటు బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. అలాగే జనసేన సైతం అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉంది. ఈ లోగా పొత్తులపై ఏదో ఒకటి తేల్చుకోవాలని అటు బీజేపీ, ఇటు జనసేనలు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.

అమిత్ షాతో కీలక భేటీ

ఇదిలా ఉంటే బీజేపీ ట్రబుల్ షూటర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈ నెల 27న అమిత్ షా సూర్యాపేటలో పర్యటించనున్నారు. అదేరోజు జనసేనాని పవన్ కల్యాణ్ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పొత్తుతోపాటు ఏపీలోని పొత్తుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే పవన్‌ను బీజేపీ కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని జనసేన ఉవ్విళ్లూరుతుంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ అత్యంత కీలకంగా మారనుంది.

ఏపీలో పొత్తులపై చర్చించే ఛాన్స్

ఏపీలో పొత్తుల అంశంపై కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జనసేనాని పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ,జనసేనలో పొత్తులో ఉన్నాయి. ఇంతలో టీడీపీతో ఎన్నికలకు వెళ్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ,బీజేపీలు కలిసి ఎన్నికలకు వెళ్తే మంచి జరుగుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అంతేకాదు బీజేపీని పొత్తుకు ఒప్పించే బాధ్యతను పవన్ కల్యాణ్ తన భుజాలపై వేసుకున్నారు. దీంతో బీజేపీ పొత్తుతో ఎన్నికలు వెళ్లాలా.. ఒంటరిగా వెళ్లాలా అన్నదానిపై ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఈ మీమాంస నుంచి బీజేపీని బయట పడేసేందుకు అలాగే 2014 ఎన్నికల మాదిరిగా మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని పవన్ కల్యాణ్ బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు, సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చిన అనంతరం ఏపీలో పొత్తుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News