విద్యాదీవెనతో పవన్ కల్యాణ్, చంద్రబాబులకు మంచి చదువు చెప్పించాలి : Minister RK Roja

జగన్‌ అంటే జనం.. జనం అంటే జగన్‌ అని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు.

Update: 2023-08-28 08:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : జగన్‌ అంటే జనం.. జనం అంటే జగన్‌ అని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. విద్య,వైద్య రంగాల్లో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. కాంపౌండర్‌ కూతురు వైద్య విద్య అభ్యసిస్తుందంటే ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది అని మంత్రి రోజా స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పేదింటి పిల్లలను విద్యకు దూరం చేశారని విమర్శించారు. ఇంటర్‌లో తాను ఏ గ్రూప్‌ చదివాడో కూడా పవన్‌ కల్యాణ్‌కు తెలియదని మంత్రి రోజా విమర్శించారు. బైపీసీ చదివితే ఇంజనీర్‌ అవ్వొచ్చని చంద్రబాబు అంటారని పవన్‌, చంద్రబాబులకు కూడా విద్యాకానుక ఇవ్వాలంటూ మంత్రి ఆర్‌కే రోజా చురకలంటించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారుల ఖతాల్లోకి బటన్ నొక్కి నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి రోజా మాట్లాడారు. విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలంటూ సెటైర్లు వేశారు. టీడీపీని నమ్ముకుంటే యువత జైలుకు వెళ్తారు. పవన్‌ను నమ్ముకుంటే యువత రిలీజ్‌ సినిమాలకు వెళ్తారు. అదే సీఎం జగన్‌ను నమ్ముకుంటే మంచి కాలేజీలు, వర్సిటీలకు వెళ్తారు. విద్యారంగంలో దేశానికే ఏపీ అదర్శంగా నిలుస్తోంది. సీఎం జగన్‌ వల్లే అన్ని వర్గాలకు విద్య చేరువైంది.కార్పోరేట్‌ స్కూళ్లకు ప్రభుత్వ స్కూళ్లు పోటీనిస్తున్నాయి. విద్యా దీవెన, వసతి పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకు రాలేదు. ఇంత గొప్ప ఆలోచన ఎవరికీ కూడా రాలేదు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారు అని మంత్రి ఆర్‌కే రోజా స్పష్టం చేశారు.

2024 వైఎస్‌ జగన్‌ వన్స్‌మోర్‌

వైఎస్‌ జగన్‌ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. జగన్‌ను ఓడించాలంటే అవతలి వైపు జగనే ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడు వైఎస్‌ జగన్‌ను ఎలా ఓడిస్తాడని ప్రశ్నించారు. ప్రజలంతా 2024 జగనన్న వన్స్‌మోర్‌ అంటున్నారని, రాష్ట్రంలోని 175 సీట్లు ఇచ్చి దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చిన ఘనత జగన్‌ది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వై‌సీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో చంద్రబాబు హయాంలో కుప్పం నియోజగకవర్గానికి ఏం చేశారని నిలదీశారు. కుప్పంలోప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్‌దేనని పేర్కొన్నారు. కుప్పంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ చతికిలబడిందన్న రోజా వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి తప్పదని హెచ్చరించారు. వారంటీ లేని చంద్రబాబు షూరిటీ ఇస్తే గ్యారెంటీ ఉంటుందా? అని మండిపడ్డారు. మనకు రియల్‌ హీరో కావాలా? రీల్‌ హీరో కావాలా అని ప్రశ్నించారు ప్రతిపక్షాలకు మళ్లీ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఆటో డ్రైవర్‌ కూతురు ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌ చేస్తోంది. రైతు బిడ్డ వ్యవసాయ శాస్త్రవేత్త చదువుతున్నాడు.ఒక మెకానిక్‌ కొడుకు మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్నాడు. కంపౌండర్‌ కూతురు డాక్టర్‌ చదువుతున్నాడంటే అది ముమ్మాటికీ సీఎం జగన్‌ వల్లే అని మంత్రి ఆర్‌కే రోజా చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News