Nara Lokesh: ఆయన కంపెనీలు కళకళ..రాష్ట్ర ఖజానా దివాలా

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Update: 2024-03-05 10:16 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు బహిరంగ సభల్లో ఇటు సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు విమర్శల జల్లు కురిపించుకుంటున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవ చేస్తూ ఓ పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ ద్వారా సీఎం జగన్ పై విమర్శల జల్లు కురిపించారు. గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతున్నాయని.. కానీ అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని పేర్కొన్నారు. ఒక్కటంటే ఒక్కటైనా కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని.. అయితే అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్‌డీ చేశారని ఎద్దేవ చేశారు.

ఇప్పటికే రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్.. తాజాగా రాష్ట్రంలో ఖనిజసంపదను తాకట్టుపెట్టి రూ.7వేల కోట్లు అప్పు తెచ్చారని ఆరోపించారు. ఇక మందుబాబులను తాకట్టుపెట్టి 33వేలకోట్లు అప్పు తెచ్చిన జగన్ జమానాలో ఇక మిగిలింది 5 కోట్లమంది జనం మాత్రమే అని ఎద్దేవ చేశారు.

ఇప్పటికే నేను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదర గొడుతున్న జగన్మోహన్ రెడ్డి మాటల వెనుక ఆంతర్యాన్ని గుర్తించి రాబోయే 2నెలలపాటు ఆయనతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా రాష్ట్రప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని వెల్లడించారు.

Tags:    

Similar News