ఆ విషయంలో జగన్, బాబు ఇద్దరు ఒకటే.. వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్

పన్నులు ఘనం.. అభివృద్ధి శూన్యమని, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన మాటలు ఏమయ్యాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

Update: 2025-03-25 05:00 GMT
ఆ విషయంలో జగన్, బాబు ఇద్దరు ఒకటే.. వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: పన్నులు ఘనం.. అభివృద్ధి శూన్యమని, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన మాటలు ఏమయ్యాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (AP Congress President YS Sharmila) అన్నారు.రాష్ట్రంలోని ఇంధన ధరలపై (Oil Prices) ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. జగన్, చంద్రబాబు లపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె.. రాష్ట్రంలో ఇవ్వాళ పెట్రోల్ ధర రూ. 109.60 పైసలు.. డీజిల్ ధర రూ 97.47 పైసలు ఉన్నదని, పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.86 పైసలు.. డీజిల్ ధర రూ.92.39 పైసలు.. ఉన్నదని తెలిపారు. అంటే తమిళనాడుతో పోల్చితే మనదగ్గర పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువ అని అన్నారు.

కర్ణాటకలో లీటరు పెట్రోల్ ధర రూ.102.90 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.88.99పైసలు ఉందని, కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటరుకు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువ అని చెప్పారు. పక్కనున్న తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర. రూ 107.46 పైసలు ఉంటే.. డీజిల్ ధర రూ. 95.70 పైసలు ఉందని, తెలంగాణతో పోల్చినా ఏపీలో లీటరు మీద 3 రూపాయలు అదనమని, పన్నులు ఘనం.. అభివృద్ధి శూన్యం ఇది రాష్ట్ర పరిస్థితి అని మండిపడ్డారు. అలాగే పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు అని, ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారపక్షంలో మరో మాట మాట్లాడుతారని దుయ్యబట్టారు.

గత 10 ఏళ్లుగా రెండు పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్పా మరోకటి కాదని, వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్ను పోటు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందువరసలో పెట్టి.. రాష్ట్ర ప్రజానీకాన్ని లూటీ చేశారని అన్నారు. బాబు మొదటి 5 ఏళ్ల పాలనలో సుమారు రూ.20 వేల కోట్ల మేర అదనపు పన్నులు వసూళ్లు చేస్తే.. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ (YS Jagan Mohan Reddy) బాదుడే బాదుడు అంటూ ఎద్దేవా చేశారని, తీరా అధికారం ఇస్తే ఆయనే బాదుడుకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడని వ్యంగ్యస్త్రాలు సంధించారు.

5 ఏళ్లలో రూ.25 వేల కోట్ల మేర ఇంధనం మీద అదనపు పన్నులు వసూలు చేశారని, ఇద్దరు కలిసి 10 ఏళ్లలో ప్రజల నుంచి రూ.50వేల కోట్లు బాదేశారని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నాడు ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారని, లీటరుకు 17 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేసి, కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంధనం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చనట్లు తెలిపారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారని, ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 17 రూపాయలు ధర తగ్గించి ఇచ్చిన హామీ వెంటనే నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల రాసుకొచ్చారు.

Similar News