Rain Alert:రాష్ట్రానికి వాయుగుండం ముప్పు..ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

రాష్ట్రానికి వాయుగుండం ముప్పు ఉందని తాజాగా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Update: 2024-08-30 13:00 GMT

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రానికి వాయుగుండం ముప్పు ఉందని తాజాగా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ మధ్య ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా కదిలి ఈరోజు (శుక్రవారం) రాత్రి 8.30 గంటలకు ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతం పై బాగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఇది వచ్చే 36 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ఏపీలో ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. దీంతో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు (శనివారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాలో మోస్తారు వర్షాలు పడతాయంది. దక్షిణ కోస్తా ఆంధ్రా, ఉత్తర కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటికి వెళ్ల వద్దని వాతావరణ అధికారులు సూచించారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

Tags:    

Similar News