Chandrababu Arrest: రూల్ ఆఫ్ లా‌ను కాపాడండి.. గవర్నర్‌కు టీడీపీ నేతల విజ్ఞప్తి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్​ వెనుక రాజకీయ కుట్ర ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు..

Update: 2023-10-18 15:27 GMT

దిశ, ఏపీ బ్యూరో: ‘టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్​ వెనుక రాజకీయ కుట్ర ఉంది. ఆయనపై మోపిన కేసుల్లో కనీస ప్రాథమిక ఆధారాల్లేవు. ఎగ్జిక్యూటివ్​ హెడ్​ అరాచకాలు, అకృత్యాలను నిలువరించాలి. ప్రజలకు రాజ్యాంగబద్దంగా సంక్రమించిన హక్కుల్ని, రూల్​ ఆఫ్​ లాను కాపాడాలని గవర్నర్​కు విజ్ఞప్తి చేశాం.’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. బుధవారం వీరిద్దరితోపాటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, ఎంఏ షరీఫ్ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, పరుచూరి అశోక్ బాబు, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గవర్నర్​ను కలిశారు. సీఎం జగన్​, వైసీపీ సర్కారు రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీపై ప్రభుత్వం చేస్తున్న దాడులపై వివరించినట్లు నేతలు మీడియాకు వెల్లడించారు.

రూల్​ ఆఫ్​ లాను కాపాడండి: యనమల

‘ప్రజలకు సంక్రమించిన రాజ్యాంగ పరమైన, ప్రజాస్వామ్యం ద్వారా సంక్రమించిన హక్కుల్ని కాపాడమని గవర్నర్​‌ను కోరాం. ప్రభుత్వ వేధింపుల్ని ఆపాలని, రూల్ ఆఫ్ లాను కాపాడాలని విజ్ఞప్తి చేశాం. దీనిపై తాము చేయగలిగింది చేస్తానని గవర్నర్ మాకు హామీనిచ్చారు. రూల్ ఆఫ్ లా అమలు అనేది గవర్నర్ పరిధిలోని అంశమే. వాటిపై ఆయన కచ్చితంగా జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగ సంస్థల్ని ముఖ్యమంత్రి తన సొంత సంస్థలుగా మార్చుకున్న తీరుని గవర్నర్‌కు ఆధారాలతో సహా తెలియచేశాం.’ అని మంత్రి యనమల పేర్కొన్నారు.

గవర్నర్​ సానుకూలంగా స్పందించారు: అచ్చెన్నాయుడు

‘పైసా అవినీతి కూడా జరగని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబు రూ.370 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ప్రభుత్వం ఆరోపణలు చేసింది . తర్వాత రూ.340 కోట్లని విషప్రచారం చేశారు. చివరకు రూ.27 కోట్లన్నారు. కథ ముగింపుకు వచ్చేసరికి స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించిన సంస్థ, కేంద్రప్రభుత్వానికి రూ. 8.50 కోట్ల జీఎస్టీ చెల్లింపులు సరిగా చేయనందునే చంద్రబాబుపై కేసు పెట్టినట్టు జగన్ ప్రభుత్వం వాదిస్తోంది. తొలుత స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని తప్పుడు కేసుపెట్టి అరెస్ట్ చేసింది. తర్వాత ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌లో అవినీతి అని, ఇన్నర్ రింగ్ రోడ్‌లో తప్పుజరిగిందని కేసులు పెట్టింది. ఈ మూడు అంశాలకు సంబంధించిన వాస్తవాల్ని ఇప్పటికే టీడీపీ ప్రజలముందుంచింది. ప్రజల ముందు ఉంచిన వాస్తవాలనే నేడు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. ఓ సవివరమైన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించాలని గవర్నరును కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు.. వాటిపై కోర్టుల్లో జరుగుతున్న విచారణ అంతా తనకు తెలుసు.’అని చెప్పారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Tags:    

Similar News