High Court: వైసీపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ

హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది...

Update: 2023-02-15 10:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులకు నోటీసులు ఇవ్వడంపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు ఇవ్వలేదని...ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా నోటీసు ఉందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు ఊరట నిచ్చేలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు పిటిషన్‌పై స్టే విధించింది. తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

ఒకటినే జీతాలు చెల్లించాలని గవర్నర్‌ను కలిసిన ఉద్యోగులు

కాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ఉద్యోగులు గవర్నర్ బీబీ హరిచందన్‌ను కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చట్టం తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రివర్గ సంఘం ఇతరత్రా తమ సమస్యల పరిష్కారం కోసం విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడంతో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. అంతేకాదు ప్రభుత్వం ఏప్రిల్ నెలలోపు స్పందించకపోతే ఇక పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.

గవర్నర్‌ను కలవడంపై ప్రభుత్వం సీరియస్

అయితే గవర్నర్‌తో ఉద్యోగ సంఘాల భేటీని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్‌ సూర్యనారాయణ, ఇతర నాయకులకు  షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసును సవాల్‌ చేస్తూ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు పిటిషన్‌పై స్టే విధించింది.

Tags:    

Similar News