చంద్రబాబు బతకాలి...అది చూసి ఏడవాలి :MP Gorantla Madhav

2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు..చంద్రబాబు చస్తాడు అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.

Update: 2023-10-30 11:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు..చంద్రబాబు చస్తాడు అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయంగా చంద్రబాబు చస్తాడు అన్న ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని.. అయితే టీడీపీ తన వ్యాఖ్యలను వక్రీకరించింది అని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. తాజాగా సోమవారం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బతకాలి... జగన్ రెండోసారి సీఎం కావడం చూసి ఆయన ఏడవాలి అంటూ మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబును రాజకీయ కక్షతోనే సీఎం జగన్ జైలుకు పంపారంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘ స్కిల్ స్కాం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది పోలీసులు... జగన్ కాదు. దర్యాప్తు చేసింది పోలీసులు... జగన్ కాదు. చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపింది నువ్వో, నేనో, ఇంకెవరో కాదు...న్యాయమూర్తి’ అని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న వ్యక్తి జైల్లో ఉండాలి..అందుకే చంద్రబాబు జైల్లో ఉన్నారని అన్నారు. మరోవైపు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపైనా గోరంట్ల మాధవ్ స్పందించారు. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు వైసీపీ ప్రభుత్వానిదే భరోసా అని చెప్పుకొచ్చారు. జైల్లో అందరు ముద్దాయిల కంటే చంద్రబాబు పెద్ద ముద్దాయి కాబట్టి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుంది అని ఎద్దేవా చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదని ఒకవేళ ఉంటే ఈ ప్రభుత్వం ప్రాణాలైనా అడ్డువేసి బతికిస్తుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు బతకాలి... 2024లో జగన్ మళ్లీ సీఎం కావడాన్ని ఆయన చూసి ఏడవాలి అన్నదే మా ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చనిపోవడానికి వీల్లేదు అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు. 

Also Read..

చంద్రబాబు జైలు నుంచి అడుగుపెట్టిన క్షణం నుంచే జగన్ పతనం ప్రారంభం: అచ్చెన్నాయుడు 

Tags:    

Similar News