Papikondalu Tour :యాంత్రికత నుంచి ప్రశాంతత వరకు.. గోదావరిలో పాపికొండల యాత్ర

ప్రశాంతమైన ప్రకృతి ఉరవడితో పారే గోదావరి వృక్షజాతులు, జంతువులతో అలరించే పాపికొండలు ఓ దివ్యానుభూతి ఉప్పొంగిపోయే గోదావరిలో లాంచీలో పాపికొండల వరకు ప్రయాణిస్తే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.

Update: 2024-10-25 15:23 GMT

దిశ,ఏలూరు: ప్రశాంతమైన ప్రకృతి ఉరవడితో పారే గోదావరి వృక్షజాతులు, జంతువులతో అలరించే పాపికొండలు ఓ దివ్యానుభూతి ఉప్పొంగిపోయే గోదావరిలో లాంచీలో పాపికొండల వరకు ప్రయాణిస్తే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. గోదారమ్మ ఒడిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే పాపికొండలు విహారయాత్ర పర్యాటకులకు ఓ మధురానుభూతి. కానీ.. ఈ ఏడాది జులై నుంచి విహారయాత్రను నిలిపేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది పర్యాటకులు మళ్లీ పాపికొండల్లో విహారయాత్ర ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్. గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన పాపికొండలు టూర్‌ను తిరిగి ప్రారంభించింది.

తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన పాపికొండలు పర్యాటకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి దేవీపట్నం మీదుగా.. పాపికొండల మధ్య గోదావరిలో బోటు షికారు చేస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ఈ విహార యాత్ర ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తోంది. అలాంటి అందాలను ఆస్వాదించాలనుకుంటే.. పాపికొండలకు వెళ్లాల్సిందే. బోట్ల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రారంభించిన.. పాపికొండల టూర్ ఇకపై రోజూ ఉంటుందని ఏపీ టూరిజం శాఖ ప్రకటించింది అంతేకాదు.. పాపికొండల్లో ఒకట్రెండు రోజులు ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని చెబుతున్నారు టూర్ నిర్వాహకులు.

ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోండిలా!

రాజమండ్రి నుంచి పాపికొండలు టూర్‌ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి గల పర్యాటకులు https://tourism.ap.gov.in/home , https://www.aptourismrajahmundri.com   వెబ్ సైట్లలో ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా.. రాజమండ్రి నుంచి ప్రైవేట్ బోట్ట్రిప్‌లు అందుబాటులో ఉంటాయి. రాజమండ్రి నుంచి గండి పోచమ్మ టెంపుల్ వరకు వాహనాల్లో తీసుకెళ్లి.. అక్కడి నుంచి 75 కిలోమీటర్ల లాంచీల్లో గోదావరిలో టూర్ కొనసాగుతుంది. మధ్యాహ్న సమయంలో పాపికొండల వద్దకు రీచ్ అవుతారు. అక్కడ కొద్ది సమయం స్పెండ్ చేశాక.. తిరిగి బోటులో సాయంత్రానికి గండి పోచమ్మ టెంపుల్‌కి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రాజమండ్రికి తీసుకొస్తారు. రాజమండ్రికి పాపికొండలకు మధ్యన టూరిజం శాఖ పోలవరం, పట్టిసీమ వద్ద కూడా టూరిస్ట్‌ స్పాట్‌లను ఏర్పాటు చేసింది. పోలవరం వద్దకు వచ్చి అక్కడి నుంచి కూడా పాపికొండలు వెళ్లవచ్చని టూరిజం శాఖ చెబుతోంది. రాజమండ్రి నుండి టూర్ ప్యాకేజీ ధర ఒక్కో వ్యక్తికి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది.

గండి పోచమ్మను దర్శించుకోవడంతో మీ టూర్ స్టార్ట్ అవుతుంది. నదికి ఇరువైపులా పాపికొండలు మధ్యలో సాగే లాంచీ ప్రయాణం.. మీకు మంచి అనుభూతినిస్తుంది. ఈ టూర్ లో భాగంగా.. పాపికొండలు, పేరంటాలపల్లి ఆశ్రమం, ఆలయం, పోలవరం ప్రాజెక్టు, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు వంటి అనేక ప్రాంతాలను వీక్షించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రయాణ సమయంలో లైఫ్ జాకెట్లు ధరించడం చాలా ముఖ్యం. అసౌకర్యంగా ఉన్నాయని వాటిని ధరించకపోతే.. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే విషాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిర్వాహకులు. కాబట్టి.. మీరు పాపికొండలు టూర్కి ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఇప్పుడే పైన చెప్పిన విధంగా బుక్ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రకృతి అందాలను ఆస్వాదించండి!


Similar News