శరన్నవరాత్రుల శోభ.. ప్రధాన ఆలయాలకు భక్తుల తాకిడి

దేవీ శరన్నవరాత్రుల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు విజయవాడ దుర్గమ్మ శ్రీలలితాత్రిపుర సుందరి అలంకరణలో, శ్రీశైలంలో కూష్మాండదుర్గ అలంకరణలో దర్శనమిస్తున్నారు.

Update: 2024-10-06 02:11 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రుల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయాల్లో అమ్మవారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా సెలవులు, పైగా ఆదివారం కావడంతో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వార్ల ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజామునుంచే అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు.

ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ.. నవరాత్రుల్లో నాల్గవ రోజు శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసిన అధికారులు.. అన్నపానీయాలకు లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు వీలైనంత త్వరగా దర్శనాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు.

శ్రీశైలంలో కూష్మాండదుర్గ..

శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజున శ్రీ భ్రమరాంబికదేవి భక్తులకు కూష్మాండదుర్గ అలంకారంలో దర్శనమిస్తున్నారు. నేడు స్వామి, అమ్మవార కైలాసవాహనంపై ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. రాత్రికి క్షేత్ర పురవీధుల్లో ఆదిదంపతుల గ్రామోత్సవం నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.


Similar News