రికార్డ్ స్థాయిలో పెన్షన్ల పంపిణీ.. ఉద్యోగులకు చంద్రబాబు అభినందనలు

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం రికార్డ్ స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఒక్కరోజులోనే దాదాపు 95 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తి

Update: 2024-07-01 16:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం రికార్డ్ స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఒక్కరోజులోనే దాదాపు 95 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు సర్కార్ పెన్షన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పెంచిన పెన్షన్లు ఒకటవ తేదీనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పెన్షన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వాలంటీర్లను దూరం పెట్టి.. సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్ల పంపిణీ చేపట్టారు. రికార్డ్ స్థాయిలో పెన్షన్ పంపిణీ జరగడంపై సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే అధికారులు, సచివాలయ ఉద్యోగులకు బాబు అభినందనలు తెలిపారు. సోమవారం రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగిందని, ఒక్క రోజులోనే 95శాతం పెన్షన్లు అందించామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్కరోజులో ఈ స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరగలేదని అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేస్తారో మరోసారి రుజువైందన్నారు. కాగా, పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో సీఎం చంద్రబాబు కూడా స్వయంగా పాల్గొన్న విషయం తెలిసిందే. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలో లబ్ధిదారులకు స్వయంగా చంద్రబాబు పెన్షన్లు అందించారు. 

Similar News