త్యాగధనులకే పట్టం.. యువనేత ఆశీస్సులెవరికో..!

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం, ఆ తర్వాత ప్రభుత్వం కొలువుదీరడంతో నామినేటెడ్ పదవులపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు...

Update: 2024-07-22 01:53 GMT

దిశ ప్రతినిధి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం, ఆ తర్వాత ప్రభుత్వం కొలువుదీరడంతో నామినేటెడ్ పదవులపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ పదవులను ఈ నెలాఖరులోపు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వందల్లో పదవులుంటే.. వేలల్లో ఆశావహులున్నారు. దీంతో పార్టీ కోసం పని చేసిన విధేయులు, ఎన్నికల సమయంలో తమ సీట్లను త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే యువనేత చేపట్టిన యువగళం పాదయాత్రలో పోలీసు కేసులు ఎదుర్కొన్న వారికి, ఐదేళ్ల పాటు ఇబ్బందులు పడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారన్న ప్రచారం జోరందుకుంది. అయితే అనేక మంది ఆశావహులు యువనేత ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

నెలాఖరులోగా కార్పొరేషన్ల పదవులు భర్తీ

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంట్ స్థానాలు సాధించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులపై ఫోకస్ పెట్టింది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ ఆశీస్సులు ఎవరెవరికి ఉండబోతున్నాయన్న చర్చ జోరందుకుంది. అందులో భాగంగానే ముఖ్యమైన ఆలయాలతో పాటు 25 ప్రధాన కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీని ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దాదాపు వందకు పైగా కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులతో పాటు టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ప్రధాన ఆలయాలకు చైర్మన్లను నియమించాల్సి ఉంది. వీటితో పాటు ఆయా కార్పొరేషన్లు, ఆలయాల్లో డైరెక్టర్‌ పదవులుంటాయి. అంతేకాకుండా జిల్లా స్థాయిలోనూ చాలా పదవులను నామినేట్‌ చేస్తుంటారు. ప్రస్తుతం తొలి విడతగా ముఖ్యమైన ఆలయాలతో పాటు 25 ప్రధాన కార్పొరేషన్ చైర్మన్‌ పదవులను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కొత్త పంథాలో సీఎం

నామినేటెడ్‌ పదవుల్లో మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు కొన్ని ఇవ్వాల్సి ఉన్నందున టీడీపీ కోటా పదవులకు తీవ్ర పోటీ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి టీడీపీలో నామినేటెడ్‌ పదవుల భర్తీకి చంద్రబాబు కొత్త పంథా అనుసరిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయడం వల్ల 31 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు. ఆ సీట్లను ఆశించిన నేతలకు నామినేటెడ్‌ పదవులు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీచ్చారు. అదేవిధంగా గత ఐదేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు.

అలాగే యువనేత లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పోలీసు కేసులు ఎదుర్కొన్న నేతలకు పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని హామీచ్చారు. ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత మంచి పదవని ఆఫర్‌ చేశారు. లోకేశ్‌ హామీతో పాటు చంద్రబాబు సైతం ప్రతిపక్షంలో పోరాట పటిమ చూపిన నేతలకు ప్రాధాన్యం ఇస్తామని చాలాసార్లు ప్రకటించారు. యువనేతతో పాటు అధినేత కూడా పలువురు నేతలకు హామీలిచ్చారు. దీంతో ఇప్పుడు తొలి విడతలోనే తమకు పదవులు వస్తాయని ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.

పదవులు ఆశించేవారిలో ఎవరెవరున్నారంటే..

ఈ నెలాఖరులోగా భర్తీ చేయనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులకు లిస్టు రెడీ అవుతోందని టీడీపీ వర్గాల సమాచారం. అయితే అందులో ఎవరిరెవరి పేరు ఉంటుందనే ఉత్కంఠ పార్టీ శ్రేణులకు నిద్రపట్టనీయడం లేదు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులపై ఆశతో గత ఐదేళ్లుగా నియోజకవర్గాల్లో కష్టపడిన నేతలు ఎందరో చివరి నిమిషంలో అధినేత నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అలాంటి వారిలో సీనియర్‌ నేతలు దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, గుంటూరు నగరానికి చెందిన కోవెలమూడి రవీంద్ర, బుద్ధా వెంకన్న, విశాఖ నగరానికి చెందిన గండి బాబ్జీ, కాకినాడ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వంటివారు ఉన్నారు.

కొందరికి ఎమ్మెల్సీ పదవులు

వీరితో పాటు పదవులు ఆశిస్తున్న టికెట్ దక్కని కొందరు నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి జనసేనకు కేటాయించగా, ఇంకొకటి కొత్తగా పార్టీలోకి వచ్చిన సి.రామచంద్రయ్యకు కేటాయించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఇక్బాల్‌తో పాటు గురజాల నియోజకవర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి వంటి వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడిన అధికార ప్రతినిధి పట్టాభి, ఎన్నికల్లో పోటీకి తొలుత టికెట్‌ పొంది బీజేపీతో పొత్తులో భాగంగా టికెట్‌ కోల్పోయిన అరకు టీడీపీ నేత దున్ను దొర, మాజీ మంత్రి కాడారి శ్రవణ్‌, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వంటి వారు నామినేటెడ్‌ పదవులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. చాలా మందికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులిచ్చి మరి కొందరిని ఎమ్మెల్సీలుగా పంపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇక కర్నూలు జిల్లా నుంచి మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, కేఈ.ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, కోట్ల సుజాతమ్మ, కె.మీనాక్షి నాయుడు, పార్టీ కోసం టికెట్లు త్యాగం చేసిన మంత్రాలయం తిక్కారెడ్డి, డోన్ ధర్మవరం సుబ్బారెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, ఇరిగెల బ్రదర్స్, గుడిసె కృష్ణమ్మ, ఆకెపోగు ప్రభాకర్, మాండ్ర శివానందరెడ్డి లాంటి వారుండగా అందులో మాజీ మంత్రి ఏరాసు, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలకు ఎమ్మెల్సీ పదవులు, ఇతరులకు నామినేటెడ్ పదవులివ్వనున్నట్లు సమాచారం.

Read More..

ఎమ్మెల్యేల సిఫారసులతో సీఐల బదిలీలు.. సీఎం ఆగ్రహం 

Tags:    

Similar News