Kuppam: నేనూ పారిపోతే ఎలా.. కుప్పంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో వైసీపీ నాయకులు పంచభూతాలను మింగేసారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు....

Update: 2023-06-16 12:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వైసీపీ నాయకులు పంచభూతాలను మింగేసారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల ఇళ్లపైనా ఈ రాక్షసులు పడతారని నేను చెపితే ముందుగా అంతా నమ్మలేదని...కానీ ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది కదా అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వైజాగ్‌లో నేటి పరిస్థితులకు ఒక ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు అన్నారు. హుద్ హుద్ ను సైతం తట్టుకున్న విశాఖ...నేడు అక్రమార్కులకు విలవిల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యక్తులను, ప్రజలను భయపెట్టి జగన్ ఇంతకాలం పాలన చేశాడని చంద్రబాబు విమర్శించారు. అయితే ఇప్పటి వరకు జనం అన్నీ భరించారని, ఇప్పుడు ఎదురుతిరుగుతున్నారని, తిరుగుబాటు మొదలైందని చెప్పారు. రానున్న రోజుల్లో వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయడమే మిగిలిందని చెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జంగ్ సోదరుడిలా రాష్ట్రంలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మూడోరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. పులివెందులలో జగన్ భయపెట్టి గెలుస్తున్నారని....కానీ కుప్పంలో ప్రజల అభిమానంతో తాను గెలుస్తున్నానని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

పేదలను ధనికులను చేయాలన్నదే మా లక్ష్యం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో అన్ని అభివృద్ధి పనులు నిలిపివేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాల్సిన బాధ్యత సీనియర్ నేతగా తనకు ఉందని చంద్రబాబు అన్నారు. 4 దశాబ్దాలుగా ఆదరించిన ప్రజల రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. అందరిలా భయపడి తాను రాష్ట్రాన్ని వదిలేస్తే....రాష్ట్రం పూర్తిగా నాశనం అవుతుందని...అలాంటి పరిస్థితి వస్తే ఎక్కువ బాధపడేది తానే అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రజల స్థితిగతులు చూసి మహానాడులో మేనిఫెస్టో విడుదల చేశామని స్పష్టం చేశారు. పేదలను ధనికులను చేయడమనేది తన సంకల్పమని చంద్రబాబు నాయుడు వివరించారు. దానిపైనా విమర్శలు చేస్తున్నారని...గతంలో హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధితో అక్కడ పరిస్థితులు మారలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

నిత్యం బూతులు తిట్టడమే వైసీపీ నేతల పని

అప్పులు చేసుకుంటూ పోవడం గొప్పవిషయం కాదని....సంపద సృష్టించి...దాన్ని పేదలకు పంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. నేడు రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు ఏపీ మధ్య ఆదాయాల్లో వ్యత్యాసం రూ. 40 వేల కోట్లు ఉందని... టీడీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ నష్టం ఉండేది కాదని చెప్పారు. ఇలా వచ్చిన సొమ్ముతో సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అన్నారు. 2014 తరువాత 5 ఏళ్లలోనే ఎంతో అభివృద్ధి చేశామని....మధ్యలో ఓటమిలేకుండా తెలుగు దేశం గెలిచి ఉంటే రాష్ట్రం ఎక్కడ ఉండేదో ఊహించండని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యాసలో పడి పార్టీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడం అనేది వాస్తవమేనని... దీని వల్ల కూడా నష్టం జరిగిందని చంద్రబాబు తెలిపారు. పవన్ కల్యాణ్ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరమని చంద్రబాబు నాయుడు అన్నారు. నిత్యం బూతులు తిట్టడం, ఎదురు దాడి చేయడమే వైసీపీ నేతలు, మంత్రులు పనిగా పెట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.

Tags:    

Similar News