పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని శాంతిభద్రతలపై చర్చ జరిగింది
దిశ, వెబ్డెస్క్: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని శాంతిభద్రతలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పాలనలో నెలకొన్న శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్ ప్రభుత్వం 2019-2024 మధ్య కాలంలో హింసను ప్రేరేపించిందన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గాన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదన్నారు. రాజకీయ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసుల మీద కేసులు పెట్టారని తెలిపారు. ఇదే సమయంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై దారుణంగా కామెంట్ చేశారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ ఏది చేసుకున్నా చట్టబద్దంగా చేసుకున్నాడు. నువ్వు ఆయన పెళ్లిళ్లపై తెగ కలవరిస్తున్నావు.. నీకు కావాలంటే పోయి వేరే కాపురం చేసుకోవయ్యా’ అంటూ జగన్ తీరును ఖండించినట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలకు, నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ విమర్శల్లో ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా తీసుకురావద్దన్నారు. ఎవరు కూడా మహిళల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలని, సోషల్ మీడియాలో కూడా మహిళలను కించపరిచే ప్రయత్నం చేయకూడదని సూచించారు. కట్టుదాటి ప్రవర్తించే నేతలపై కఠిన చర్యలు ఉంటాయని, ఎవరిని కూడా వదిలిపెట్టనని హెచ్చిరించారు.