మీ అభిమానం మరవలేను.. భావోద్వేగానికి గురైన చంద్రబాబు

తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. నేను కష్టంలో

Update: 2023-11-01 01:47 GMT

దిశ, ఏపీ బ్యూరో: 'తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. నేను కష్టంలో ఉన్నప్పుడు 52 రోజులుగా రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారు, పూజలు చేశారు. ఏపీలోనే కాకుండా తెలంగాణ, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు నాపై చూపించిన అభిమానాన్ని జీవితంలో మరువలేను. నేను చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజెప్పారు, ఫలాలు పొందిన వారంతా సంఘీభావం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లాభం పొందిన వారంతా చూపిన అభిమానంతో నా జీవితం ధన్యమైంది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికి కూడా రాదు. 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో నేను ఏ తప్పూ చేయలేదు, తప్పు చేయడానికి అనుమతించలేదు. ప్రపంచవ్యాప్తంగా నాకు అండగా నిలిచిన తెలుగు ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అని రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు భావేద్వేగానికి గురయ్యారు

'నాకు సహకరించిన, సంఘీభావం తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు నా అభినందనలు. జనసేన పార్టీ బహిరంగంగా వచ్చి నాకు సంఘీభావం తెలిపింది, పవన్ కల్యాణ్ కు మనస్పూర్తిగా అభినందనలు. సంఘీభావం తెలిపిన సీపీఐ, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇతర పార్టీల వారందరికీ అభినందనలు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు నా కోసం సైకిల్ యాత్ర చేశారు. వారందరినీ అభినందిస్తున్నా. హైదరాబాద్ లో సైబర్ టవర్స్ నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఐటీ ప్రొఫెషనల్స్ నాకు కనీవినీ ఎరుగని రీతిలో సంఘీభావం తెలియజేయడం జీవితంలో మరువలేను. అందరినీ పేరుపేరునా అభినందిస్తున్నాను. మీడియా వారు కూడా పెద్దఎత్తున సహకరించారు, వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అని చంద్రబాబు తెలిపారు

Tags:    

Similar News