పవన్ సూపర్ స్పీడ్... 536 మందికి 7 నెలలు జీతం విడుదల

ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే పథకం సాగుతోంది...

Update: 2024-09-12 03:07 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే పథకం సాగుతోంది. ఇందులో పని చేసే 536 మంది కార్మికులకు 7 నెలలుగా జీతాలు అందటం లేదు. ఈ సమస్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి రాగానే పరిష్కారం లభించింది. జీతాల బకాయిల చెల్లింపుపై ఆయన ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు. బకాయిలకు సంబంధించి రూ.30 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి బి.ఆర్.ఓ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో విడుదల చేశారు.

సీఎంకు ధన్యవాదాలు...

ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 1341 గ్రామాల్లో, సుమారు 20 లక్షల జనాభాకు ఈ స్కీం ద్వారా తాగు నీరు అందుతోంది. ఈ స్కీం నిర్వహణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేసే కార్మికులకు గత ఫిబ్రవరి నుంచి వేతనాలు నిలిచిపోయాయి. రూ.30 కోట్ల మేర పెండింగ్ వేతనాలు ఆగిపోయాయి. కార్మికులు విధులకి దూరంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ దృష్టికి రాగానే గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారులను ఆరా తీశారు. ఆర్థికశాఖ అధికారులతో మాట్లాడారు. రూ.30 కోట్లను వేతనాల కోసం విడుదల చేసేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. కార్మికుల వేతన బకాయిల సమస్యపై సత్వరమే స్పందించిన ఆర్థిక, పంచాయతీరాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విభాగాలు సానుకూల దృక్పథంతో పని చేసేలా దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు.


Similar News