పేలిన బస్సు టైర్.. మహిళలకు తీవ్ర గాయాలు..

బస్సు టైర్ పేలి మహిళలకు తీవ్ర గాయాలైన ఘటన హుస్నాబాద్ లో బుధవారం జరిగింది.

Update: 2024-09-18 10:39 GMT

దిశ, హుస్నాబాద్ : బస్సు టైర్ పేలి మహిళలకు తీవ్ర గాయాలైన ఘటన హుస్నాబాద్ లో బుధవారం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు నాగారం రోడ్డు బైపాస్ నుండి కరీంనగర్ కు వెళ్తున్న క్రమంలో శ్రీనివాస హాస్పిటల్ ముందు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వెనకనున్న రెండు టైర్లలో ఒకటి భారీ శబ్దం చేస్తూ పేలిపోగా ఆ శబ్దానికి రేకు ఒక్కసారిగా పైకి లేచి సీట్లో కూర్చొని ఉన్న పెద్దపల్లి జిల్లా సబ్బితంకు చెందిన కళ్యాణి, ప్రవళిక, అక్కన్నపేట మండలం కుందన వానపల్లి గ్రామపంచాయతీ మబ్బుకుంట తండాకు చెందిన శశి ప్రియతో సహా ముగ్గురు మహిళల కాళ్లకు గాయాలై రక్తస్రావం జరిగింది.

కాగా పెద్దపల్లికి చెందిన ఇద్దరు మహిళల కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన కళ్యాణి, ప్రవళిక ఇద్దరు మహిళలు హుస్నాబాద్ లో జరిగిన వేస్టేజ్ మీటింగ్ కు వచ్చారు. శశిప్రియ మబ్బుకుంట తండా నుండి కరీంనగర్ కు వెళ్తున్నది. అయితే ఆర్టీసీ బస్సు టైర్లు నాణ్యత లోపించి పూర్తిగా అరిగిపోయి ఉండడం చేతనే పేలిపోయిందని ప్రయాణికులు చెప్పడం గమనార్హం.


Similar News