వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న భర్త.. కేసు పెట్టిన భార్యకే షాక్ ఇచ్చిన కోర్టు

దాంపత్య జీవితంలో గొడవలు సహజం.

Update: 2023-09-18 08:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: దాంపత్య జీవితంలో గొడవలు సహజం. కానీ, కొంత మంది భార్యలు చిన్న చిన్న తప్పులకే భర్తలను దూరం పెట్టి పుట్టింటికి వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే కొంత మంది భర్తలు వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమో లేక పెళ్లి చేసుకోవడమో చేస్తారు. అంతే కాదు తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు చూస్తారు. ఇటీవల ఓ భర్త కూడా ఇదే విధంగా చేశాడు. చీటికి మాటికి తనతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోతున్న భార్యకు విడాకులు ఇచ్చాడు. అయితే విడాకులు తీసుకోవడం తనకు ఇష్టం లేదని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన భార్యకు కోర్టు షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ కేసుకు సంబంధించిన దంపతులు 2005 నుంచే విడివిడిగా ఉంటున్నారు. అంతే కాకుండా భార్య భర్తపై క్రిమినల్ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేసేది. దీంతో విసుగు చెందిన సదురు వ్యక్తి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. భార్య వేధింపులకు సంబంధించిన అన్ని వివరాలు తన మీద పెట్టిన కేసు వివరాలు కోర్టు ముందుంచాడు. దీంతో కేసు వాదోపవాదాలు విన్న కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. కానీ, తన భర్త నుంచి విడాకులు తీసుకోవడం ఇష్టం లేని భార్య.. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తన భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని, ఆమెను పెళ్లి చేసుకున్నాడని అందుకే తనకు విడాకులు ఇవ్వడానికి చూస్తున్నాడని ఆరోపించింది. అతడిని నేను వేధిస్తున్నానడం నిజం కాదని తమకు ఇచ్చిన విడాకులు రద్దు చేయాలని కోరింది.


అయితే.. కేసు విచారణ చేపట్టిన జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం సదరు భర్తకే సపోర్ట్‌గా మాట్లాడి భార్యకు షాక్ ఇచ్చారు. సుదీర్ఘకాలంపాటు దంపతులు వేరువేరుగా ఉండటం భార్య భర్తను, అతని కుటుంబాన్ని పట్టించుకోకుండా కేసులు పెట్టి వేధించటం కరెక్ట్ కాదని పేర్కొంది. విడాకుల వ్యవహారం కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు భర్త మరొక మహిళతో కలిసి ఉన్నందున విడాకులు రద్దు చేయాలన్న భార్య వాదనను హైకోర్టు తప్పుబట్టి.. వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది.


Similar News