electric shock :విద్యుత్ షాక్ తో రైతు మృతి
విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని కోనాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
దిశ,చెన్నారావుపేట : విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని కోనాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... ఇదే గ్రామానికి చెందిన తుమ్మలపెల్లి రాజిరెడ్డి (50) అనే రైతు గ్రామ శివారులోని సరళ కుంట చెరువు సమీపంలో ఉన్న తన పొలం వద్దకు వెళ్లాడు. ఇటీవల నాటు వేయడంతో పొలం మడులలో నీరు పారిద్దామని విద్యుత్ మోటార్ వద్దకు వెళ్లాడు. విద్యుత్ మోటార్ నడవకపోవడంతో విద్యుత్ స్తంభానికి తగిలించిన తీగలను సరిచేస్తుండగా ఒక విద్యుత్ తీగ వూడి మీద పడడంతో విద్యుత్ ప్రసారమై
అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విద్యుత్ షాక్ తో రైతు రాజిరెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో మృతుడి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. గ్రామస్తుల సమాచారం మేరకు చెన్నారావుపేట ఏఎస్ఐ లక్ష్మణమూర్తి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ లక్ష్మణమూర్తి తెలిపారు.