తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి

నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పరిధిలో గల సుభాష్ నగర్ లో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది.

Update: 2023-12-15 15:28 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పరిధిలో గల సుభాష్ నగర్ లో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. సుభాష్ నగర్ కు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి పీటర్ తన కుమారుడి నిశ్చితార్థం కోసం హైదరాబాద్ కు గురువారం ఉదయం షాపింగ్ కు వెళ్లారు. అక్కడ షాపింగ్ ముగించుకుని వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో షాక్ కు గురయ్యారు. ఇంటి యజమాని రాకను గుర్తించిన ఆగంతకులు గోడ దూకి పరారీ అయ్యారు. పీటర్ ఇంట్లో పడక గదిలో బీరువాను పగులగొట్టి 11 తులాల బంగారం, లక్షన్నర నగదు అపహరించినట్లు గుర్తించారు. ఆగంతకులు పారిపోతూ రెండు తులాల చైన్ ను వదిలి వెళ్లారు.

అగంతకులు చోరి కోసం తెచ్చిన బైక్ ను అక్కడే వదిలి వెళ్లడంతో దానిని పోలీసులకు అప్పగించారు. శుక్రవారం ఉదయం 3వ టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు, ఆనవాళ్ళను సేకరించారు. దొంగతనం స్థానికుల పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బైక్ ను గుర్తించి అగంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అగంతకులు ఉపయోగించిన బైక్ దొంగిలించినది అయితే వారిని పట్టుకునేందుకు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. స్థానికంగా గల్లీలో ఓ ఇంట్లో నమోదైన సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఇద్దరు అగంతకులు చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ నెల 18న పీటర్ తనయుడి నిశ్చితార్థం ఉండడంతో ఇంట్లో బంగారం, నగదును ఉంచడంతో దొంగలు దోచారని లబోదిబోమంటున్నారు.

Tags:    

Similar News