లక్షకు పైగా కేసులతో.. ‘మహా’మ్మారి ముప్పుతిప్పలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మహారాష్ట్రను ముప్పుతిప్పలు పెడుతున్నది. ఈ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తూ కంటిపై కునుకులేకుండా చేస్తున్నది. కొత్త కేసులు, మరణాలతో రాష్ట్రాన్ని గజగజ వణికిస్తున్నది. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో మూడింట ఒక వంతు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కేసులు మూడు లక్షలను దాటితే ఈ ఒక్క రాష్ట్రంలోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. ఆందోళనకర విషయమేమంటే తొలుత వైరస్ విస్తరణ నెమ్మదిగా సాగినా.. క్రమంగా భారీ వేగాన్ని సంతరించుకుంది. తొలి కేసు నమోదైన తర్వాతి […]

Update: 2020-06-13 10:03 GMT

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మహారాష్ట్రను ముప్పుతిప్పలు పెడుతున్నది. ఈ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తూ కంటిపై కునుకులేకుండా చేస్తున్నది. కొత్త కేసులు, మరణాలతో రాష్ట్రాన్ని గజగజ వణికిస్తున్నది. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో మూడింట ఒక వంతు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కేసులు మూడు లక్షలను దాటితే ఈ ఒక్క రాష్ట్రంలోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. ఆందోళనకర విషయమేమంటే తొలుత వైరస్ విస్తరణ నెమ్మదిగా సాగినా.. క్రమంగా భారీ వేగాన్ని సంతరించుకుంది. తొలి కేసు నమోదైన తర్వాతి 96 రోజుల్లో ఈ రాష్ట్రం లక్ష కేసుల మార్క్‌ను దాటింది. అందులో చివరి 50 వేల కేసులు కేవలం 19 రోజుల్లోనే నమోదవడం గమనార్హం. కాగా, కరోనా మరణాలు అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయి. దేశం మొత్తంలో కరోనా మరణాలు 8,884గా రిపోర్ట్ అవ్వగా అందులో 3,717 ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లాగే మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నగరాల్లోనే నమోదవుతున్నాయి. రాష్ట్ర రాజధాని ముంబయిలోనే సగానికి పైగా కేసులు వెలుగుచూశాయి. 55,451 కేసులతో దేశానికే కరోనా హాట్‌స్పాట్‌గా ఈ మహానగరం ఉన్నది. మహారాష్ట్ర తర్వాత కరోనా పంజా విసిరిన రాష్ట్రాల్లో తమిళనాడు, ఢిల్లీలున్నాయి.

టాప్ 17వ స్థానంలో ఉండేది..

మహారాష్ట్రలో తొలి రెండు కేసులు మార్చి 9న రిపోర్ట్ అయ్యాయి. దుబాయికి వెళ్లొచ్చిన దంపతులతో కరోనా మహారాష్ట్రలో అడుగిడింది. అప్పటి నుంచి 77 రోజుల్లో 50వేల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. కేవలం 19 రోజుల్లోనే మిగతా 50వేల కేసులు నమోదయ్యాయి. ఈ నెలలోనే(12వతేదీ వరకు) రాష్ట్రంలో కరోనా కేసులు సుమారు 30వేలు రిపోర్ట్ అయ్యాయంటే ఎంత వేగంగా కేసులు పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 1.01లక్షల కేసులతో మహారాష్ట్ర ఒక దేశమై ఉంటే ప్రపంచంలో టాప్ 17వ స్థానంలో ఉండేది. అదీ చైనా కంటే అత్యధిక కేసులున్న దేశంగా ఉండేది. 3,717 కరోనా మరణాలతోనూ చాలా దేశాల కంటే వరస్ట్‌గా ఉండేదని అర్థమవుతుంది.

ముంబయి విలవిల

మనదేశంలో అత్యధిక కేసులున్న నగరం ముంబయి. దేశంలోని మూడింట ఒక వంతు కేసులు మహారాష్ట్రలో నమోదైతే, మహారాష్ట్రలోని దాదాపు 55శాతం కేసులు కేవలం ముంబయిలోనే రిపోర్ట్ అయ్యాయి. ఈ నగరం తర్వాత థానె(16,443), పూణె(11,281)ల్లోనూ భారీగానే వెలుగుచూశాయి. మూడు రోజులుగా ముంబయిలో రోజుకు సుమారు 90 కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని 8,884 మరణాల్లో దాదాపు రెండు వేల మరణాలు కేవలం ఈ నగరంలోనే నమోదవడం గమనార్హం. రాష్ట్రంలోని మొత్తం మరణాల్లో దాదాపు 55శాతం (2,044) మరణాలు ముంబయిలోనే చోటుచేసుకున్నాయి. కరోనా ధాటికి విలవిలలాడుతున్న ఈ మహానగరం కొవిడ్ 19 పేషెంట్‌లను పర్యవేక్షించడానికే ఆపసోపాలు పడుతున్నది. నగర ఆస్పత్రులు కరోనా పేషెంట్‌లతో నిండిపోయాయి. హాస్పిటళ్లలో అడ్మిట్ కావడానికి రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసినా వెయిటింగ్‌లోనే ఉండాల్సిన పరిస్థితులున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లోనైతే మృతదేహాల నిర్వహణా కష్టతరంగా మారింది.

ఐదు నగరాల్లోనే దేశంలోని సగం కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నగరాల్లోనే విస్తరించింది. అలాగే, మనదేశంలోనూ ప్రధానంగా నగరాల్లోనే కేంద్రీకృతమై సవాల్ విసురుతున్నది. దేశంలోని సగం కేసులు కేవలం ఐదు నగరాల్లో నమోదవ్వడమే ఇందుకు నిదర్శనం. అందులోనూ రెండు నగరాలూ మహారాష్ట్రకు చెందినవే కావడం గమనార్హం. ముంబయి(55,451), ఢిల్లీ(36,824), థానె(16,443), గుజరాత్‌లోని అహ్మదాబాద్(దాదాపు 16 వేలు), తమిళనాడు రాజధాని చెన్నై(సుమారు 27వేలు)ల్లోనే లక్షన్నరకు మించి కరోనా కేసులున్నాయి. దేశంలోని మూడు లక్షల కేసుల్లో సగం కేసులు కేవలం ఈ ఐదు నగరాల్లోనే వెలుగుచూశాయి.

Tags:    

Similar News