ICC World Cup 2023: నెదర్లాండ్స్ నెట్ బౌలర్లుగా మనోళ్లు..
మరో రెండు వారాల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ పోరు ప్రారంభం కానుంది.
దిశ, వెబ్డెస్క్: మరో రెండు వారాల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ పోరు ప్రారంభం కానుంది. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు ఇప్పటికే ఇక్కడకు చేరుకుని సాధనను ముమ్మరం చేసింది. అందుకోసం భారత్కు చెందిన నలుగురిని నెట్ బౌలర్లుగా నెదర్లాండ్స్ జట్టు ఎంపిక చేసుకుంది. వీరిలో చెన్నైకి చెందిన లోకేశ్ కుమార్ ఉన్నాడు. అతడు స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కావడం గమనార్హం. తమ నెట్ బౌలర్లను పరిచయం చేస్తూ నెదర్లాండ్స్ టీమ్ ట్విటర్ వేదికగా (ఎక్స్) వీడియోను షేర్ చేసింది.
అందులో చెన్నైకి చెందిన లోకేశ్ కుమార్ స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే క్రికెటర్గా రాణిస్తున్నాడని ఓ జాతీయ వెబ్సైట్ వెల్లడించింది. నెదర్లాండ్స్ జట్టుకు నెట్బౌలర్గా ఎంపిక కావడంపై లోకేశ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశాడు. నెదర్లాండ్స్ అక్టోబర్ 6 నుంచి పాకిస్థాన్తో తొలి మ్యాచ్తో వన్డే ప్రపంచకప్ సమరం ప్రారంభించనుంది. అయితే, అంతకుముందు భారత్తో (అక్టోబర్ 3న) వార్మప్ మ్యాచ్లో తలపడనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్తో సెప్టెంబరు 29న నెదర్లాండ్స్ తమ తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
1. రాజమణి ప్రసాద్.. లెఫ్టార్మ్ పేసర్
హైదరాబాద్, తెలంగాణ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడిన అనుభవం
ప్రస్తుతం చెన్నై సూపర్కింగ్స్ నెట్ బౌలర్గా ఉన్నాడు.
2. హేమంత్ కుమార్- లెఫ్టార్మ్ పేసర్
చురు, రాజస్తాన్
రాజస్తాన్ హైకోర్టులో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
2022, 2023 సీజన్లలో రాజస్తాన్ రాయల్స్ అతడిని నెట్బౌలర్గా నియమించుకుంది.
3. హర్ష్ శర్మ.. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్
కురుక్షేత్ర, హర్యానా
నార్త్జోన్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్ విజేత.. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్ రన్నరప్
2022లో ఆర్సీబీ క్యాంపులో నెట్బౌలర్గా సేవలు అందించాడు.
4. లోకేశ్ కుమార్- మిస్టరీ బౌలర్
చెన్నై, తమిళనాడు
జీవనోపాధి కోసం పగలంతా స్విగ్గీలో లోకేశ్ పని
ఐపీఎల్లో ఆడాలనే ఆశయం
ఎనిమిదేళ్ల క్రితం పేసర్గా మొదలైన లోకేశ్ ప్రస్తుతం మిస్టరీ స్పిన్నర్గా మారాడు.