Tilak Varma: తెలుగోడికి దక్కని చోటు.. 2003, 2019 సీన్ రిపీట్‌ అవుతుందా?

వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Update: 2023-09-06 13:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి భారత సెలెక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఇక అందరూ ఊహించినట్లుగానే తెలుగు తేజం తిలక్ వర్మకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో 2003, 2019 ప్రపంచకప్‌ సమయంలో ఇలాగే తెలుగు క్రికెటర్లకు చోటు దక్కని అంశాలు చర్చలోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఫీలయ్యారు. సెలక్షన్‌లో జరిగిన ఈ తప్పిదం టోర్నీలో జట్టు అవకాశాలను కూడా దెబ్బ తీయడం గమనార్హం. 2003లో వీవీఎస్ లక్ష్మణ్‌ కు, 2019లో అంబటి రాయుడి కి ఇలాంటి అన్యాయమే జరిగింది. అది జట్టుకూ చేటు చేసింది.

ఇప్పుడు తిలక్ వర్మ విషయంలోనూ సెలక్టర్లు తప్పు చేశారా అనే చర్చ జరుగుతోంది. 2019 ప్రపంచకప్‌ ముంగిట అంబటి రాయుడికి జరిగిన అన్యాయంపై పెద్ద చర్చే జరిగింది. అప్పుడు చీఫ్ సెలక్టర్ తెలుగువాడైన ఎమ్మెస్కే ప్రసాదే. అప్పటికే టీమ్ ఇండియాకు కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ మెరుగైన ప్రదర్శనే చేశాడు రాయుడు. అతడి వన్డే సగటు 47 కావడం గమనార్హం. ఐతే చివరగా ఆడిన ఓ సిరీస్‌లో మాత్రమే రాయుడు ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. ఆ మాత్రానికే సెలక్టర్లు అతణ్ని పక్కన పెట్టేశారు. మిడిలార్డర్లో సత్తా చాటగల అనుభవం, నైపుణ్యం ఉన్నా సరే రాయుడిని పక్కన పెట్టేశారు.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు రకాలుగా ఉపయోగపడతాడని.. ‘త్రీడీ ప్లేయర్’ అంటూ తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంపిక చేసింది ప్రసాద్ కమిటీ. కానీ అతను ఏ డైమన్షన్‌లోనూ జట్టుకు ఉపయోగపడలేదు. పేలవ ప్రదర్శనతో జట్టుకు భారంగా మారాడు. శంకర్ వల్ల జట్టు సమతూకమే దెబ్బతింది. విజయ్ ఫెయిలయ్యాడని దినేశ్ కార్తీక్‌ను ఆడిస్తే అతనూ తేలిపోయాడు. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో ఓడి జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్‌లో రాయుడు ఉంటే కథ వేరుగా ఉండేదన్న అభిప్రాయం అభిమానుల్లోనే కాక విశ్లేషకుల్లోనూ వ్యక్తమైంది.

ఈసారి హైదరాబాద్ నుంచి మహ్మద్ సిరాజ్ ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. కానీ తనతో పాటు తెలుగు గడ్డ నుంచి తిలక్ వర్మ కూడా ప్రపంచకప్‌లో ఆడతాడని ఫ్యాన్స్ ఆశించారు. ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో అతను అదరగొట్టాడు. ఈ మధ్యే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. తొలి సిరీస్‌లో ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఒత్తిడిలో పట్టుదలతో నిలిచాడు. 5 మ్యాచ్‌ల్లో 58 సగటుతో 173 పరుగులు చేశాడు. దీంతో అనూహ్యంగా ప్రపంచకప్ రేసులోకి వచ్చాడు. ఆసియా కప్‌ వన్డే టోర్నీకి ఎంపిక కావడంతో తిలక్ ప్రపంచకప్‌లో ఆడటంపై ఆశలు రేగాయి. కానీ చివరికి అనుభవం లేదని అతడిని పక్కన పెట్టేశారు. ఫిట్‌నెస్‌పై సందేహాలున్నప్పటికీ కేఎల్ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌లకు అవకాశమిచ్చారు. మరోవైపు వన్డేల్లో సాధారణ ప్రదర్శన చేసిన, ఎన్నో అవకాశాలిచ్చినా ఉపయోగించుకోని సూర్యకుమార్‌ కూడా ఎంపికయ్యాడు. అరంగేట్రంలోనే సీనియర్లను మించి చక్కటి ప్రదర్శన చేసిన తిలక్‌ను అనుభవం లేదని పక్కన పెట్టడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


Similar News