ఎదురుచూపులకు ‘ఆధారే’ నిలువెత్తు సాక్ష్యం..

by Sridhar Babu |
ఎదురుచూపులకు ‘ఆధారే’ నిలువెత్తు సాక్ష్యం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజలు తమ ఇబ్బందులను ఏ రూపకంగానైనా ప్రదర్శిస్తారు. గతంలో రైతు బంధు కోసం బ్యాంకుల వద్ద క్యూ లైన్లో గంటలు గంటలు వేచి ఉండలేక చెప్పులు, తమతో తెచ్చుకున్న పాసు బుక్కులను వరుసలో పెట్టి చెట్ల కింద సేద తీరిన విషయం తెలిసిందే. ఆ క్యూ లైన్‌ను చూస్తే చాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు పడే బాధలు ఇట్టే అర్థమవుతాయి.

అదేవిధంగా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కోసం ఉదయం 7 గంటలకే పీహెచ్సీ కేంద్రానికి చేరుకున్న మహిళలు, పురుషులు క్యూ లైన్లో తమ ఆధార్ కార్డులను ఉంచి మరోసారి తమ ఇబ్బందులను చూపించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం పీహెచ్సీ సెంటర్ వద్ద మంగళవారం ఉదయం దర్శనమిచ్చింది. టీకా కోసం పొద్దున్నే పీహెచ్సీ కేంద్రానికి చేరుకున్న తమను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇలా ఆధార్ కార్డులను వరుస క్రమంలో ఉంచి చెట్ల నీడలో ఉండి ఎదురుచూస్తున్నట్లు ప్రజలు వెల్లడించారు. కాగా, టీకా వేయించుకోవాలనుకునే వారు ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంటబెట్టుకుని వెళ్లాలి.

Next Story

Most Viewed