కాబోయే భర్తే కదా అని.. అలా చేసి ఇంట్లో దొరికిపోయిన యువతి

by Sumithra |
gold jewelry
X

దిశ, ఏపీ బ్యూరో: మ్యాట్రిమోని ద్వారా పరిచమయ్యాడు. యూకేలో జాబ్ చేస్తున్నట్లు నమ్మించాడు. నువ్వంటే నాకిష్టం త్వరలో పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. తీరా ఆ యువతి అతడి ప్రేమలో మునిగితేలుతుండగా అతడి అసలు స్వరూపం బయటపెట్టాడు. పెళ్లికి ఏడు వారాల నగలు పంపిస్తున్నానని చెప్పి తన స్నేహితుల ద్వారా యువతి నుంచి రూ.2.25 లక్షలు కొట్టేశాడు. రోజులు గడుస్తున్నా బంగారం రాకపోయేసరికి ప్రియుడికి ఫోన్ చేయగా అతడు ఫోన్ పని చేయడం లేదు. దీంతో తాను మోసపోయానని భావించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ షాకింగ్ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో చోటు చేసుకుంది.

బాపట్ల మండలం నందిరాజుతోట పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పాల్‌ మాణిక్‌ అనే వ్యక్తి ఫొటోలు పంపించాడు. ఒకరినొకరు ఫొటోలు చూసుకున్నారు. తాను యూకేలో పనిచేస్తున్నానని పాల్ మాణిక్ యువతికి చెప్పుకొచ్చాడు. ఇద్దరికి ఒకరినొకరు నచ్చడంతో ఫోన్‌లలో మాట్లాడుకునేవారు. పెళ్లి కూడా చేసుకుందామని డిసైడ్ అయ్యారు. అయితే అత్తవారింటి నుంచి కోడలికి ఇచ్చే ఏడువారాల నగలు పెళ్లికి ముందే పంపిస్తున్నానని యువతికి చెప్పాడు. ఆ తర్వాత నగలు ఢిల్లీకి వచ్చాయని, కస్టమ్స్‌ సుంకం చెల్లించాలంటూ వేరే వ్యక్తులతో ఫోన్‌ చేయించి ఆన్‌లైన్‌లో మూడు దఫాలుగా రూ.2.25 లక్షల నగదు వసూలు చేయించాడు.

కాబోయే వరుడే కదా అని అతడి మాటలు నమ్మిన యువతి ఇంట్లో వారికి తెలియకుండా స్నేహితుల వద్ద అప్పు చేసి మరీ ఆ రూ.2.25 లక్షలు చెల్లించింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెళ్లి చేసుకుంటానన్న ప్రియుడు లిఫ్ట్ చేయకపోవడంతో తాను మోసపోయానని గ్రహించింది. కుటుంబ సభ్యులకు చెప్పి బోరున విలపించింది. కుటుంబ సభ్యుల సహకారంతో బాధిత యువతి బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.



Next Story