బ్రిటన్ పార్లమెంట్‌లో భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎంపీ

by Ramesh N |
బ్రిటన్ పార్లమెంట్‌లో భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎంపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ సంతతికి చెందిన శివానీ రాజా బ్రిటన్‌ పార్లమెంటులో భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే శివానీ రాజా ట్విట్టర్ వేదికగా తాజాగా పోస్ట్ చేశారు. తాను భగవద్గీతపై ప్రమాణం చేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన మూలలు మర్చిపోకుండా భగవద్గీతపై ప్రమాణం చేయడం పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో శివానీ రాజా లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థిని అయిన ఆమె లేబర్‌ పార్టీ అభ్యర్థి, లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేశ్‌ అగర్వాల్‌పై గెలుపొందారు.

గుజరాత్ మూలాలున్న ఈ 29 ఏళ్ల శివాని వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. యూకేలో భారత సంతతి ఎంపీగా చిన్న వయసులో శివాని గెలవడం గమనార్హం. అయితే, ఆమె గెలుపుతో లేబర్ పార్టీకి షాక్ తగిలింది. 37 ఏళ్లుగా ఆమె పోటీ చేసిన స్థానం లేబర్ పార్టీకి కంచుకోటగా ఉండేది. అదేవిధంగా బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తుల హవా కొనసాగింది. మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. కాగా, ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. భారత సంతతికి చెందిన ఆ పార్టీ నేత, రిషి సునాక్ తన అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Next Story