HEAVY RAINS: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు

by Kavitha |
HEAVY RAINS: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెలరోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఇరు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. తెలంగాణలో వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇక ఏపీలో విజయవాడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. బుడమేరు వాగు ముంచేసింది. ఇప్పటికీ అక్కడ ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. గత వారం రోజులుగా వరుణుడు కాస్త బ్రేక్ ఇచ్చాడని సంతోషపడేలోగా ఐఎండీ(IMD) మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. రాబోయో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్‌పల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం ఉంటుందని.. ఉదయం ఎండ, ఆ వెంటనే మేఘాలు.. మళ్లీ ఎండ రావడం లాటింది జరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

అలాగే పశ్చిమ బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతోంది. గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుంచి వీస్తున్నాయి. దీంతో రానున్న 3 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు అని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఇక వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పార్వతీపురం మన్యం , విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు తీరప్రాంతం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయని తెలిపింది. కాగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed