మూడు రోజుల్లో మూడున్నర వేల కరోనా కేసులు

by  |
మూడు రోజుల్లో మూడున్నర వేల కరోనా కేసులు
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. డిశ్చార్జి అవుతున్నవారికి దాదాపు పది రెట్ల మేరకు కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో దాదాపు మూడున్నర వేల కేసులు పెరిగాయి. ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం దేశం మొత్తం మీద 8,447 పాజిటివ్ కేసులు ఉంటే 15వ తేదీ సాయంత్రం అదే సమయానికి ముగిసిన 72 గంటల వ్యవధిలో 3,486 కేసులు పెరిగి మొత్తం 11,933కు చేరుకుంది. మృతుల సంఖ్య 99 పెరిగి 372కు చేరుకుంది. గడచిన 24 గంటల వ్యవధిలో దేశం మొత్తం మీద 1,117 కొత్త కేసులు నమోదయ్యాయి. 39 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశంలోని 718 జిల్లాల్లో 377 జిల్లాల్లో కరోనా బాధలు ఉన్నట్లు కేంద్రం నిర్ధారించింది. ఇందులో 170 జిల్లాలో వైరస్ వ్యాప్తి, పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండడంతో కేంద్రం వీటిని ‘రెడ్ జోన్’గా పరిగణించింది. మిగిలిన 207 జిల్లాలను ‘ఆరెంజ్ జోన్’గా గుర్తించింది.

దేశంలో తొలుత కరోనా వైరస్‌తో భయపెట్టిన కేరళలో ఇప్పుడు ఆ భయం తగ్గిపోతోంది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల కంటే చికిత్స అనంతరం ఆరోగ్యంతో ఇళ్ళకు వెళ్తున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. బుధవారం ఒక పాజిటివ్ కేసు నమోదుకాగా ఏడుగురు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 167 యాక్టివ్ కేసులు ఉంటే డిశ్చార్జి అయినవారి సంఖ్య 218గా ఉంది. తెలంగాణలో మాత్రం హైదరాబాద్ అత్యధిక కేసులతో ‘రెడ్ జోన్’గా తయారైంది. కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం సంఖ్య 650కు చేరుకుంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు 42 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 525 అయింది. తమిళనాడులో సైతం 38 కొత్త కేసులు రావడంతో మొత్తం సంఖ్య 1,242కు చేరుకుంది. ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 14కు పెరిగింది. దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో మొత్తం పేషెంట్ల సంఖ్య వేయి దాటగా మధ్యప్రదేశ్‌లో చేరువగా ఉంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వేలకు చేరువవుతోంది. దేశం మొత్తం మీద కరోనా కారణంగా చనిపోయినవారిలో దాదాపు సగం మంది మహారాష్ట్రలోనే ఉన్నారు.

లాక్‌డౌన్ కాలంలో ఇళ్ళకే పరిమితం కావాలని, తప్పనిసరి అవసరాలకు మాత్రమే బయటకు రావాలని కేంద్రం మొత్తుకుంటూ ఉంది. వైరస్ వ్యాప్తి నిరోధకానికి ‘సామాజిక దూరం’ ఒక్కటే సరైన మందు అని నొక్కిచెప్తూ ఉంది. కానీ, 21 రోజుల లాక్‌డౌన్ గడువును మరో 19 రోజులు పొడిగిస్తూ ప్రధాని ప్రకటించిన గంటల వ్యవధిలోనే దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు ఆందోళనతో రోడ్డెక్కారు. ‘సామాజిక దూరం’ నీరుగారిపోయింది. పేదల ఆకలి కేకలు, ఈ గందరగోళం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని ఆందోళనతో స్వస్థలాలకు వెళ్ళేందుకు చేసిన ప్రయత్నాలతో హైదరాబాద్, సూరత్, బాంద్రా, ఢిల్లీ, తిరువనంతపురం.. ఇలా అనేక పట్టణాల్లో ధర్నా పరిస్థితులు నెలకొన్నాయి. ఏ రాష్ట్రానికి చెందినవారైనా తెలంగాణ గడ్డమీద ఉండిపోయిన వలస కార్మికులు తమ బిడ్డలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా భరోసా కల్పించినా వేలాది మంది కార్మికులకు బియ్యం అందకపోవడంతో రోడ్డెక్కక తప్పలేదు. అన్నీ సక్రమంగా అందుతున్నాయని భావించిన మంత్రి కేటీఆర్‌కు ఇప్పటికీ ‘మా కడుపు నింపండి’ అనే ట్వీట్‌ల వెల్లువ కొనసాగుతూనే ఉంది.

దేశం :
మొత్తం కేసులు : 11,933
మృతులు : 392
రికవరీ : 1344
తెలంగాణ :
మొత్తం కేసులు : 650
మృతులు : 18
రికవరీ : 118
ఆంధ్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 525
మృతులు : 14
రికవరీ : 20

Tags : India, Corona, COVID-19, Positive, Deaths, Red Zones, Hot Spot,

Next Story

Most Viewed