ప్రధాని చెప్పినవన్నీ నిజాలే.. ఎట్టకేలకు ఒప్పుకున్న కేసీఆర్ (వీడియో)

by GSrikanth |
ప్రధాని చెప్పినవన్నీ నిజాలే.. ఎట్టకేలకు ఒప్పుకున్న కేసీఆర్ (వీడియో)
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ భావించింది నిజమేనా?.. కేసీఆర్ రాజకీయ వారసుడిగా నిర్ణయం జరిగిపోయిందా?.. కేటీఆర్‌ను ఆశీర్వదించాల్సిందిగా మోడీని కేసీఆర్ కోరింది కూడా నిజమేనా?.. ఎన్డీఏ కూటమిలో చేరడానికి సిద్ధమైందీ నిజమేనా?.. ఈ నెల 7న ప్రదాని మోడీ తెలంగాణ టూర్ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కరెక్టేనని సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారు.. ఇండియా టుడే (నవంబరు 27, 2023 సంచిక)లో కవర్ స్టోరీగా పబ్లిష్ అయిన స్టోరీకి అనుబంధంగా కేసీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.

గతంలో ఢిల్లీ టూర్‌కు వచ్చినప్పుడు ఏకాంతంగా జరిగిన సమావేశంలో కేసీఆర్ వెల్లడించిన అంశాలను ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రస్తావించారు. వెంటనే కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “నేను సీఎం కావడానికి మోడీ ఆశీర్వాదంతో పనేముంది? బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే సరిపోతుంది..” అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బట్ట కాల్చి మీదేసే తీరులో మోడీ వ్యాఖ్యానిస్తున్నారని, ప్రధాని స్థాయిలో అబద్ధాలు చెప్తున్నారని వ్యాఖ్యానించారు. వెంటనే గులాబీ నేతలంతా మోడీకి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు.

కానీ, కేసీఆర్ మాత్రం ఎక్కడా మోడీ కామెంట్ల గురించి ప్రస్తావించలేదు. తెలంగాణ గడ్డ మీద మోడీ చేసిన కామెంట్లు నిజమో.. అబద్ధమో.. చెప్పకుండా మౌనం వహించారు. ఆ మౌనానికి అర్థమేంటనే అభిప్రాయాలూ ప్రజల నుంచి, విపక్షాల నేతల నుంచి వినిపించాయి. చివరకు ఇండియా టుడే గ్రూపు ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప, సీనియర్ డిప్యూటీ ఎడిటర్ అమర్‌నాధ్ మీనన్ సంయుక్తంగా చేసిన ఇంటర్‌వ్యూలో కేసీఆర్ తనదైన శైలిలో మోడీ కామెంట్లమీదా, ఢిల్లీలో ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలమీదా క్లారిటీ ఇచ్చారు.

ప్ర : ఎన్డీఏలో చేరడంపై 2021లోనే మోడీతో మాటలు జరిగాయా?

జ. : ఆయన (మోడీని ఉద్దేశించి) బుర్రకు తట్టిన మాటలన్నింటినీ కథలుగా చెప్తే దానికి నేనేం చేయగలను? ఒక సీఎం హోదాలో ప్రధాని మోడీని కలిశాను.. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను కొనసాగించాల్సిన బాధ్యత ఉన్నది. ఎన్డీఏలో చేరాల్సిందిగా నన్ను అడిగారు. కానీ నేను దానికి కొంత వివరణ ఇచ్చాను. ముందుగా తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయండి.. ఆ తర్వాత.. అని సూచించాను. కానీ తెలంగాణకు కేంద్రం నుంచి మంచి ఏమీ జరగలేదు. మోడీ సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ల వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు ప్రధానిగా ఉంటూ గవర్నర్ల చర్యలపై మాట్లాడడంలేదు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ (తమిళిసై సౌందర్ రాజన్) ఆపుతున్నారు. ఆమోదించడంలేదు. ఇది థర్డ్ క్లాస్ పాలిటిక్స్.

ప్ర. : సీఎంగా కేటీఆర్‌ను ఆశీర్వదించాల్సిందిగా కోరడం..

జ. : మోడీకి, నాకు మధ్య ప్రైవేటు సంభాషణ జరిగింది. నాకు 70 ఏండ్ల వయసు వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకున్న అంశాన్ని మోడీకి చెప్పాను. అప్పటికి నా పొలిటికల్ ఎక్స్ పీరియన్స్ 50 ఏండ్లు పూర్తవుతుంది. ఆ సందర్భంగా కేటీఆర్ ఎలా ఉన్నాడని మోడీ అడిగారు. చెప్పాల్సింది చెప్పాను. ప్రధానిగా ఉన్నందున ఆయనను (కేటీఆర్‌ను) ఆశీర్వదించి సహకరించాలని కోరాను. ఇద్దరి మధ్య వక్తిగతంగా, ప్రైవేటుగా జరిగిన సంభాషణనలను ప్రధాని స్థాయిలో మోడీ బహిర్గతం చేయడం సమంజసమా? రాజకీయ వేదికల మీద వ్యక్తిగతమైన, ప్రైవేటు కాన్వర్జేషన్‌కు సంబంధించిన అంశాలను వెల్లడించడం ప్రధాని స్థాయికి తగునా?

రెండేండ్ల క్రితం జరిగిన సంభాషణనలను సరిగ్గా తెలంగాణ ఎన్నికల సమయంలో మోడీ ఇక్కడికి వచ్చి ఒక బహిరంగసభలో ప్రస్తావించడం కేసీఆర్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి కూడా కేసీఆర్ ధైర్యం చేయలేదు. మోడీ చేసిన వ్యాఖ్యలను నిజమని ఒప్పుకోలేక.. అబద్ధమంటూ కొట్టిపారేయలేక సతమతమయ్యారు. కేటీఆర్, హరీశ్‌రావు, పలువురు మంత్రులు మోడీపై నిప్పులు చెరిగారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ ప్రస్తావన లేకుండా మౌనం వహించారు. ఇలా సైలెంట్‌గా ఉండడం కూడా అనేక అనుమనాలకు, చర్చలకు తావిచ్చింది.

ఇప్పుడు ఇండియా టుడే ఇంటర్‌వ్యూలో ఈ విషయాన్ని కేసీఆర్ వివరించడంతో మోడీ చేసిన వ్యాఖ్యలు నిజమేనని స్పష్టమైంది. సందర్భమేదైనా వీరిద్దరి మధ్య ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరడం, కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రగా కేటీఆర్ ఆ బాధ్యతలు చేపట్టడం, ఒక పెద్దమనిషిగా ప్రధాని మోడీ ఆశీర్వాదాన్ని కేసీఆర్ కోరడం.. ఇవన్నీ నిజమేనని క్లారిటీ ఏర్పడింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పడంతో ఇంతకాలం ఖండించిన కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు గులాబీ నేతలు ఇప్పుడు డిఫెన్సులో పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed