డోర్నకల్ హస్తం శ్రేణుల్లో కలవరం

by Mahesh |
డోర్నకల్ హస్తం శ్రేణుల్లో కలవరం
X

దిశ, డోర్నకల్: పదేళ్ల నిరీక్షణ అనంతరం గెలుపును సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త కలవరం మొదలైంది. ఏళ్ల తరబడి ఏ నేతల కింద అనేక కేసులు, అవమానాలకు గురైయ్యారో మళ్లీ అందులోని కొంత మంది నేతలు హస్తం వైపు చూస్తోండటం, పెద్దల అంగీకారం కోసం కలుస్తుండటంతో డోర్నకల్ కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ,లోకల్ బాడీ, పార్లమెంట్ ఎన్నికలపై అధిష్టానం దిశ నిర్ధేశం చేయగా, గ్రామాల్లో పార్టీ బలోపేతానికి, నామినేటెడ్ పదవుల ఎంపికకు కసరత్తులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చేరికలు అది కూడా పాత అధికార పక్షం నుంచి ఉంటాయన్నా ఊహాగానాలు జోరందుకున్నాయి.

దీంతో కాంగ్రెస్ శ్రేణులు తమకే పదవులు, ప్రాధాన్యత దక్కాలని, కొత్తవారిని ప్రజలు తిరస్కరించిన వారిని పార్టీలోకి తీసుకోకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. పలువురు వ్యాపారులు, పెత్తందారులు, దళారులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు ఉంటారు. అందులో భాగంగానే ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీతో అంటకాగారు.. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందటంతో వారిలో కొందరు హస్తం వైపు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి ఆర్థిక అవసరాల కోసం పార్టీని ఆశ్రయిస్తున్నట్లు పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలువురు పెద్దలను కలిసినా అక్కడ భంగపాటు గురైయ్యారని సమాచారం.

ఈ నేపథ్యంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని, బీఆర్ఎస్ హయాంలో ఉన్నవారు మరింత సంపాదించుకున్నారని, పేదలు వెనుకబడ్డారని, సమసమాజ స్థాపన, ఆర్థిక స్వావలంబన కోసం ఎమ్మెల్యే సరికొత్త నిర్ణయాలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రజలు తిరస్కరించిన వారిని పంచన చేర్చుకుంటే పెద్ద ధిక్కారానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా గత ప్రభుత్వాల హయాంలో అక్రమార్జన చేసిన దళారుల వివరాలు ప్రతి రూపాయితో బయటపెట్టి ప్రజలకు అభివృద్ధి అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించాలి

భారీ మెజార్టీతో మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను ఓడించిన నూతన ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రు నాయక్ కొత్తగా ఏ చేరికలను ప్రొత్సహించనప్పటికీ.. చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి ఎంట్రీ ఇచ్చిన వారితో ఇబ్బంది లేకున్నా.. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో అంటిపెట్టుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.ఆటుపోట్లు,కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలిచి పార్టీని నమ్ముకొని ముందుకు సాగుతున్నాము.గతంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీని వీడకుండా నిబద్ధతకు కట్టుబడి ఉన్నాను. ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ గెలుపుకు అహర్నిశలు శ్రమించాను. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకైక కౌన్సిలర్ అయిన నన్ను గుర్తించాలి. - శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్, డోర్నకల్ పురపాలక 8వ వార్డు కౌన్సిలర్


Next Story

Most Viewed