TG Govt.: తెలంగాణ విజన్-2047.. కేంద్రం గైడ్‌లైన్స్ మేరకు శాఖల వారీగా ప్రణాళికలు!

by Shiva |
TG Govt.: తెలంగాణ విజన్-2047.. కేంద్రం గైడ్‌లైన్స్ మేరకు శాఖల వారీగా ప్రణాళికలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విజన్ -​2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలను రూపొందించేందుకు సిద్ధమైంది. 2047 నాటికి దేశానికి స్వాత్రంత్యం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకోనున్నది. ఈ సందర్భంగా ప్రపంచంలోనే భారత్‌ను, దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందించనున్నది. సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర సర్కారు సైతం శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించనున్నది. 2047 నాటికి రాష్ట్ర జనాభా ఎంత ఉండబోతోంది.. అందులో పట్టణ, గ్రామీణ జనాభా ఎంత ఉంటుంది.. అప్పటి వరకు వారి అవసరాలు, మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది.

అన్ని రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి నుంచే శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. 2047 విజన్‌లో ప్రధానంగా విద్య, వైద్యం, నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయం, ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు ప్రాథమిక కసరత్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, కనీస వసతులు, గిరిజనులు, దళితులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు ఇలా అనేక కేటగిరీలు, శాఖల వారీగా ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న జనాభా లెక్కల ప్రకారం 2047 నాటికి ఏ విధంగా జనాభా ఉండబోతుంది. అవసరాలు ఏ స్థాయిలో పెరగనున్నాయనే అంశాలను పొందుపరుస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26న ముందే నిర్ణయించిన నాలుగు పథకాల ప్రారంభోత్సవం ఉండటంతో అధికారులు ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమయ్యారు. అది పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కేంద్రం మార్గదర్శకాలపై కసరత్తు చేయనున్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed