Serilingampally: పారిశుధ్య నిర్వహణలో చిత్తశుద్ధేది..? శేరిలింగంపల్లి జోనల్‌లో పరిస్థితి అధ్వాన్నం

by Shiva |
Serilingampally: పారిశుధ్య నిర్వహణలో చిత్తశుద్ధేది..? శేరిలింగంపల్లి జోనల్‌లో పరిస్థితి అధ్వాన్నం
X

దిశ, శేరిలింగంపల్లి: వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, పరిశుభ్రత పాటించాలంటూ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి ప్రతి రోజూ ఎక్కడో చోట పర్యటిస్తూ కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ ప్రకటనలు చేస్తున్నారు. కానీ వాస్తవంలో అమలుకాక ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తుంది. వీధులన్నీ చెత్తతో నిండిపోతున్నాయి. నిర్వహణ లోపంతో పలు డివిజన్లలో ఏ ఎక్కడి చెత్త అక్కడే పేరుకు పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కొన్నిచోట్ల రోజుల తరబడి చెత్తను తొలగించక పోవడంతో ఆవైపు నుండి వెళ్లాలంటేనే జనాలు దుర్గంధంతో ముక్కుమూసుకుని పోవాల్సి వస్తుంది. వందలాది మంది జీహెచ్ఎంసీ సిబ్బంది, చెత్త తొలగింపు నిర్వహణ చూసేందుకు ఎస్‌ఎఫ్‌ఏలు, ఏఎంఓహెచ్ అంటూ పలువురు అధికారులు ఉన్నా నిర్వహణ మాత్రం అధ్వానంగా మారింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాల వల్ల వ్యర్థాలు కుళ్లిపోయి దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో మలేరియా, డెంగ్యూ జ్వరాలతో జనాలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

ఎక్కడి చెత్త అక్కడే..

శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలోని ఆయా డివిజన్లలో చెత్త నిర్వహణ ధ్వానంగా మారింది. గచ్చిబౌలి డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో రోజుల తరబడి చెత్తను తొలగించక పోవడంతో గుట్టలుగా పేరుకు పోయింది. స్లమ్ ఏరియాల్లో అయితే 15 రోజులకు ఒకసారి సైతం జీహెచ్ఎంసీ సిబ్బంది రారని స్థానికులు చెబుతున్నారు. శేరిలింగంపల్లిలోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తారానగర్, శివాజీ నగర్‌లో రోడ్ల పక్కనే చెత్త గుట్టలుగా పేరుకు పోయింది. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో రోజుల తరబడి చెత్త అలాగే ఉంటుందని, జీహెచ్ఎంసీ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

ఇక మియాపూర్, మదీనాగూడ, ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, మైత్రీ నగర్, హఫీజ్ పేట్, ప్రేమ్ నగర్, ఇంద్రారెడ్డి అల్వీన్ కాలనీ ఇలా అనేక ప్రాంతాల్లోనూ చెత్త నిర్వహణలో జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసర సమయాల్లోనూ శేరిలింగంపల్లి జోనల్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ సిబ్బంది కానీ, మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు పెద్దగా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వర్షాలు పడిన సమయంలో మాత్రమే గాక నేటికి జీహెచ్ఎంసీ సిబ్బంది, మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చందానగర్, మియాపూర్, హఫీజ్‌పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్లలో వీధుల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించకపోవడం జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి నగర పరిశుభ్రతపై ఎంతటి చిత్తశుద్ధి ఉందనేది అర్థం అవుతుందని పలువురు మండిపడుతున్నారు.

జడ్సీ పర్యటిస్తారు.. డీసీలు పట్టించుకోరు

భారీ వర్షాలతో ఎక్కడా వరద నీరు నిల్వకుండా చూడాలి, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని తరచూ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో పర్యటిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆయా సర్కిళ్ల పరిధిలో ఉదయమే పలుచోట్ల పర్యటించి హడావుడి చేస్తున్నారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. జెడ్సీ పర్యటనలు చేస్తూ చెత్త నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తుంటే డీసీలు, ఆ కిందిస్థాయి సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

డిప్యూటీ కనిషనర్లు సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, చెత్త నిర్వహణతో పాటు ఆయా అంశాలను గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి శేరిలింగంపల్లికి జడ్సీగా ఉపేందర్ రెడ్డి వచ్చాక భారీ మార్పులు ఉంటాయని ఆశించిన శేరిలింగంపల్లి ప్రజానీకానికి నిరాశ తప్పడం లేదు. చెత్త నిర్వహణతో పాటు అభివృద్ధి విషయంలో శేరిలింగంపల్లి గతంలో కంటే అధ్వాన్నంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



Next Story