అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దు.. ఎంపీ అర్వింద్ ధర్మపురి..

by Sumithra |
అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దు.. ఎంపీ అర్వింద్ ధర్మపురి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి మీదే దృష్టి పెట్టాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో శనివారం జరిగిన దిశా సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను అధోగతి పాలు చేసిందని, విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని అర్వింద్ అన్నారు. పీఎంశ్రీ కింద కేంద్ర ప్రభుత్వం రూ. 20 కోట్ల నిధులతో 40 ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, లాబొరేటరీస్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూ.20 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. వాటికి సంబంధించిన పనుల పై రివ్యూ జరిపినట్లు అర్వింద్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ ఇతర పనులకు డైవర్ట్ చేసిందన్నారు. జిల్లాలో పలుచోట్ల కొనసాగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్ వో బీ), అండర్ రైల్వే బ్రిడ్జి (యు ఆర్ బీ) పనులకు కేంద్రం విడుదల చేసిన నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం డైవర్ట్ చేసిందన్నారు.

దీంతో మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి వద్ద కొనసాగుతున్న ఆర్ఓబీ పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొందన్నారు. ఒక్క మాధవనగర్ ఆర్ఓబీ పనులు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులతో కొనసాగుతున్నాయని, మిగతా పనులన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులను ఇచ్చిందని అర్వింద్ అన్నారు. అడవి మామిడిపల్లి ఆర్ఓబీ పనులకు కేంద్రం మంజూరు చేసిన రూ.18 కోట్ల నిధులను గత ప్రభుత్వం ఇతర పనులకు డైవర్ట్ చేయడంతో పనులు నిలిచిపోయాయన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిధుల విడుదల కోసం అడిగితే కొద్దికొద్దిగా మంజూరు చేస్తోందన్నారు. డెవలప్మెంట్ పనులకు సంబంధించిన ఫైలు ముందుకు కదలకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్రనిధులు, రాష్ట్రనిధులంటూ సమయాన్ని వృధా చేయొద్దని, పనులు త్వరగా పూర్తి చేయించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అర్వింద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను డైవర్ట్ చేయకుండా ఉద్దేశించిన పనులకే వినియోగించాలని తాము కోరుతున్నామన్నారు. మాధవ నగర్ అడవి మామిడిపల్లి, ఆర్మూర్ మామిడిపల్లి పనులను వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు. నిజామాబాద్ ఆర్మూర్ రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ఆ పనులు టీవీ సీరియల్ ను తలపిస్తున్నాయని అర్వింద్ ఎద్దేవా చేశారు.

నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలకు అమృత్ పథకం కింద రూ.335 కోట్లు కేంద్ర నిధులు మంజూరయ్యాయని ఎంపీ అర్వింద్ తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.217 కోట్లు, బోధన్ కు రూ. 50 కోట్లు, ఆర్మూర్ కు రూ.43 కోట్లు, భీమ్ గల్ కురూ. 25 కోట్లు మంజూరైనట్లు ఎంపీ తెలిపారు. నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 2009 నుంచి కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ప్రణాళికలతోనైనా ఈ పనులకు మోక్షం కలగాలని భగవంతుని కోరుకోవడం మినహా మరేం చేసేది లేదని నిరాశగా అన్నారు. కాంపానిధులు, విశ్వకర్మ దరఖాస్తులు, గ్రామీణ సడక్ యోజనకు సంబంధించిన 11 పనుల పై దిశా మీటింగ్ లో రివ్యూ చేశామని ఎంపీ వివరించారు. ఆయా పనులకు సంబంధించిన నివేదికలను తమకు అందజేయాలని కలెక్టర్ కు సూచించామని అర్వింద్ తెలిపారు. ఆయన వెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు కూడా ఉన్నారు.

Advertisement

Next Story