డిమాండ్ ఉన్న పంటలకే మొగ్గు చూపిన జిల్లా రైతులు..

by Sumithra |
డిమాండ్ ఉన్న పంటలకే మొగ్గు చూపిన జిల్లా రైతులు..
X

దిశ, ఆలూర్ : నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా వరిసాగు ఎక్కువగా ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. వర్షాలు కురవడం, కరెంటు అందుబాటులో ఉండటంతో రైతులు పెద్దఎత్తున పంటలు సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటలతో పాటు వరిసాగుకే రైతులు మొగ్గు చూపారు. జిల్లా వ్యాప్తంగా పంటల సాగు పై వ్యవసాయ అధికారులు క్లస్టర్ల వారిగా వివరాలను సేకరిస్తున్నారు. సర్వేనంబర్‌ ఆధారంగా విస్తీర్ణాన్ని నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం సన్నరకాల ధాన్యానికి బోనస్‌ ప్రకటించడంతో వరిసాగు మొత్తం విస్తీర్ణంలో 15 శాతానికి పైగా జిల్లాలో పెరిగింది. శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో సాగు కూడా పెరిగింది. కూలీల అవసరం తక్కువగా ఉండటం, దిగుబడి కూడా ఎక్కువ మొత్తంలో వస్తుండటం పండిన ధాన్యాన్ని ప్రభుత్వంతో పాటు వ్యాపారులు కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో రైతులు ఈ సాగుకు మొగ్గు చూపారు. ఖర్చు తక్కువగా ఉండటంతో ప్రతీ ఏడాది వరి విస్తీర్ణం పెంచుతున్నారు. జిల్లాలో వరి సాగు పెరగడంతో వ్యవసాయ శాఖ అధికారులు కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచుతున్నారు.

5.49 లక్షల ఎకరాల్లో పంటలు..

నిజామాబాదు జిల్లాలో ఈ ఏడాది 5 లక్షల 49 వేల "60 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అయితే ఇందులో మొత్తం సాగు విస్తీర్ణంలో 4 లక్షల 29 వేల 108 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. గతేడాది కంటే 22 వేల ఎకరాల్లో ఎక్కువగా వరి సాగవుతోంది. ఈ ఏడాది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకాలు సాగుచేసే రైతులకు క్వింటాకు రూ.500 బోనస్‌ ప్రకటించడంతో రైతులు వరి సాగుకు ఎక్కువగా మళ్లారు. గతేడాది కంటే 89 శాతం అత్యధికంగా వరి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా చేసి ప్రభుత్వానికి వివరాలను పంపించారు. ప్రభుత్వం బోనస్‌ ప్రకటించడంతో ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో సాగవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది వానాకాలంలో మొదట తక్కువగానే వరి సాగు అయినా ఆగస్టులో వర్షాలు పుంజుకోవడంతో సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో 11 లక్షల 94 వేల 154 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనావేశారు. ఈ దఫా మార్కెట్‌కు, కొనుగోలు కేంద్రాలకు 8 లక్షల 85 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనావేశారు. ఈ ధాన్యంలో 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు.

65 శాతానికి పెరిగిన సన్న రకం..

ఐదేళ్ల క్రితం వరకు జిల్లాలో సన్నరకం సాగు 25 శాతంలోపు ఉండగా ప్రస్తుతం ఈ సీజన్‌లో 65 శాతానికి పైగా పెరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ వానాకాలంలో సాగు అయిన మొత్తం విస్తీర్ణంలో 3 లక్షల 76 వేల ఎకరాలకు పైగా సన్నపు రకాలను వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముందస్తుగా సాగుచేసిన రైతులకు వ్యాపారులు క్వింటాలు 2600 నుంచి 2800 వరకు ధర పెట్టి కొనుగోలు చేస్తుండటంతో ఎక్కువగా ఈ పంటను వేశారు. గత కొన్నేళ్లుగా సన్నరకాలకు దిగుబడి కూడా ఎక్కువగా వస్తుండటంతో ఎకరాకు 30 క్వింటాలకు పైగా వస్తున్నడంతో రైతులు సన్నరకపు సాగుకు మొగ్గు చూపారు.

500 బోనస్ ప్రకటనతో పెరిగిన వరి సాగు...

ప్రభుత్వం బోనస్‌ ప్రకటించడంతో సన్నరకాల సాగు ఎక్కువైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో వరితో పాటు ఈ ఏడాది మొక్కజొన్న సాగు కూడా ఎక్కువగా చేశారు. జిల్లాలో 44 వేల 855 ఎకరాల్లో ఈ పంటను వేశారు. గత ఏడాది కంటే 20 శాతం అధికంగా ఈ పంటను సాగుచేశారు. జిల్లాలో సోయా 35 వేల ఎకరాల్లో వేశారు. గత సంవత్సరం కంటే 50 శాతం ఈ పంటను రైతులు తక్కువగా వేశారు. పసుపునకు భారీగా డిమాండ్‌ వచ్చినా రైతులు సాగును ఎక్కువ మొత్తంలో పెంచలేదు. జిల్లాలో 25 వేల 144 ఎకరాల్లోనే పసుపు సాగు చేస్తున్నారు. పెరుగుతున్న పెట్టుబడి, అవసరమైన లేబర్‌ కొరతతో సాగును తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ పంటలతో పాటు కంది, పెసర, మినుములతో పాటు కూరగాయల సాగును కొనసాగించారు.

పసుపు వైపు మొగ్గు చూపని రైతులు..

గత సంవత్సరం పసుపునకు డిమాండ్‌ పెరిగినా ఈ ఏడాది సాగుకు రైతులు మొగ్గు చూపలేదు. గతేడాది కంటే కేవలం 8వేల ఎకరాలు తక్కువ సాగు చేస్తున్నారు. ఈ వానాకాలం 25వేల ఎకరాల్లో ఈ పంటను చేస్తున్నారు. ధర బాగా ఉన్నా రైతులు మాత్రం పంటకు మొగ్గు చూపలేదు..

ఈ 33 రకాల సన్నాల సాగు..

కెర్నల్ ఎల్/బీ రేషియో ప్రకారం ప్రభుత్వం సన్న బియ్యం రకాలను గుర్తిస్తుంది. గింజ పొడవు 6 మి.మీ, వెడల్పు 2.మీ.మీ కన్నా తక్కువగా, ఎల్/బీ రేషియో 2.5 కన్నా ఎక్కువగా ఉంటే సన్నాలుగా గుర్తిస్తుంది. ఆ 33 రకాలను పరిశీలిస్తే.. తెలంగాణ సోనా (ఆర్ఎన్ ఆర్ 15048), వరంగల్ సాంబ (డబ్లూజీఎల్14), వరంగల్ సన్నాలు (డబ్లూజీఎల్ 32100), సాంబ మసూరి (బీపీటీ 5204), జగిత్యాల వరి-3 (జేజీఎల్ 27356), జగిత్యాల వరి-2 (జేజీఎల్ 28545), హెచ్ఎంటీ సోనా, మారుటేరు సాంబ (ఎంటీయూ 1224), మారుటేరు మసూరి (ఎంటీయూ 1262), ఎంటీయూ 1271 వరంగల్ వరి-2 (డబ్ల్యూజీఎల్ 962), నెల్లూరు మసూరి (ఎస్ఎల్ఆర్ 34449), సోమనాథ్ (డబ్ల్యూజీఎల్ 347), కరీంనగర్ సాంబ (జేజీఎల్ 3855), అంజన (జీజీఎల్ 11118), ప్రత్యుమ్న (జేజీఎల్ 17004), సుగంధ సాంబ (ఆర్ఎన్ఆర్ 2465), కేపీఎస్ 6251 (పీఆర్సీ), రాజేంద్రనగర్ వరి-4 (ఆర్ఎస్ఆర్ 21278), వరంగల్ వరి-1119, కునారం వరి-2 (కేఎన్ఎం 1638), కునారం వరి-1 (కేఎస్ఆర్ 733), సిద్ది(డబ్ల్యూ జీఎల్ 44), జేజీఎల్ 33124 (పీఆర్సీ), కంపాసాగర్ వరి-1(కేపీఎస్ 2874), జగిత్యాల మసూరి (జిజీఎల్11470), పొలాస ప్రభ (జేజీఎల్384), కృష్ణ (ఆర్ఎస్ఆర్2458), మానేరు సోనా (జేజీఎల్ 3828), జగిత్యాల సన్నాలు (జీజీఎల్1798), జగిత్యాల సాంబ (జేజీఎల్3844), శోఖిని (ఆర్ఎన్ఆర్ 2354), ఆర్ఎస్ఆర్ 31479 (పీఆర్సీ) ఉన్నాయి.

సన్న రకాల బియ్యం దిగుబడి తక్కువగా ఉన్నా, ధర ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది సన్న రకాల బియ్యమే వాడుతున్నారు. కొంతమంది రేషన్‌లో దొడ్డు బియ్యం తీసుకున్నా, దాన్ని తినలేక, ఇతరులకు అమ్మేసుకుంటున్నారు. ఎక్కువ ధర పెట్టి.. సన్న రకం కొంటున్నారు. అందుకే ఈ సమస్యలకు చెక్ పెడుతూ, ప్రభుత్వమే సన్న రకాలు ఇవ్వాలనుకుంది.

ఇప్పుడు సన్నాలకు మార్కెట్లో క్వింటాలుకు రూ.2500 పైగా లభిస్తోంది. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో, వ్యాపారులే పొలం దగ్గరకు వచ్చి, కొంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ సన్న రకాలకు బోనస్ ఇస్తుండటం వల్ల.. ఈ ఖరీఫ్ సాగులో.. సన్న బియ్యం దిగుబడి పెరగనుంది. తద్వారా కొరత తీరనుంది.

వివరాలు సేకరిస్తున్నాం ... ఏమో సురేష్ బాబు ...

పంటల సాగు పై వ్యవసాయ అధికారులు క్లస్టర్ల వారిగా వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించమని దిశా ప్రతినిధికి తెలియజేశారు అధికారి.

Advertisement

Next Story