కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ

by Sridhar Babu |
కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్  సెంటర్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
X

దిశ ప్రతినిధి , నిజామాబాద్ : శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డిలు రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు, వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను పరిశీలిస్తూ, తుదిదశ ఏర్పాట్లను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు.

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద బందోబస్తు, తాగునీరు, విద్యుత్, కౌంటింగ్ టేబుల్స్, కౌంటర్లు, ఇతర అన్ని ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలను అమర్చి నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి, అభ్యర్థులు, ఏజెంట్లకు రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో ఏర్పాటు చేసిన బారీకేడ్లను పరిశీలించి

పలు సూచనలు చేశారు. కౌంటింగ్ హాళ్లకు ఏర్పాటు చేసిన మెటల్ మెష్, బారీకేడ్లు పరిశీలించారు. అన్ని చోట్ల విద్యుత్ వసతి, ఫ్యాన్లు, లైట్లు పని చేస్తున్నాయా లేదా అన్నది పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని ట్రాన్స్​కో ఏడీఈ రాజశేఖర్ ను ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా జెనరేటర్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ, ఓటింగ్ పూర్తయిన మీదట చేపట్టే కౌంటింగ్ ప్రక్రియలు సాఫీగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు డీసీపీ జయరాం, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Next Story