KVSN Raju : మధ్యతరగతిని మోసం చేసిన బడ్జెట్..

by Sumithra |
KVSN Raju : మధ్యతరగతిని మోసం చేసిన బడ్జెట్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ కార్పొరేట్లకు, ధనవంతులకు మాత్రమే అనుకూలంగా ఉందని, మధ్య తరగతిని పూర్తిగా విస్మరించిందని ఇన్సూరెన్స్ ఉద్యోగుల జాతీయ నాయకులు కె వి ఎస్ ఎన్ రాజు అన్నారు. నిజామాబాద్ నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ఈ విఎల్. నారాయణ అధ్యక్షతన జరిగిన "కేంద్ర బడ్జెట్ - మధ్యతరగతి పై ప్రభావం" అనే అంశం పై నిర్వహించిన సెమినార్ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సెమినార్ నుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ దేశ ఆర్థిక ప్రగతిలో 19 శాతం వాటాకు చేరుకుందన్నారు. అదే పరిస్థితుల్లో కార్పొరేట్లు చెల్లించే పన్ను 17 శాతం వాటాగా ఉందన్నారు. ప్రభుత్వ విధానాల మూలంగా కోట్లు సంపాదించి, పన్ను చెల్లించగలిగే స్థాయి వర్గాలకు రాయితీలు ఇస్తూ, బడుగు బలహీన వర్గాలు, మధ్య తరగతి వర్గాల నుంచి మాత్రం ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

క్యాపిటల్ గెయిన్స్ పైన కూడా పన్ను పెంచారని, కోట్లు రుణాలుగా తీసుకొని బ్యాంకులను మోసం చేసి దర్జాగా తిరుగుతున్న వారి నుండి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ బడ్జెట్లో రైతులకు, కార్మికులకు మొండి చేయి చూపించిందన్నారు. మహిళోద్ధరణ గురించి మాట్లాడే వారు కోటి మంది పనిచేస్తున్న స్కీం వర్కర్ల గురించి ఊసే ఎత్తడం లేదని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల పాటు ప్రజల కోసం, ప్రభుత్వంలో పనిచేసిన ఈపీఎస్ పెన్షనర్లకు వస్తున్న నెలకు రూ. 2 వేలు పెన్షన్ ను మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి వారు 60 లక్షల మందికి పైగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఒక్క శాతం ఉన్న అంబానీ, ఆదానీ లాంటి వారి ప్రయోజనాల కోసమే ఈ బడ్జెట్ రూపొందించిందని రాజు అన్నారు. దేశం ఒక కోటి 68 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ఈ డబ్బు ఎవరికోసం ఖర్చు పెట్టిందని ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సెమినార్లో ఉద్యోగ సంఘం జిల్లా నాయకులు శ్రీధర్, శిర్ప హనుమాండ్లు, మధుసూదన్, హుస్సేన్, రామ్మోహన్రావు, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed