8 మంది అరెస్ట్.. పరారీలో ముగ్గురు.. ఇంతకీ ఏమైందో తెలుసా..?

by Naveena |
8 మంది అరెస్ట్.. పరారీలో ముగ్గురు.. ఇంతకీ ఏమైందో తెలుసా..?
X

దిశ, కామారెడ్డి : పదవ తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు యత్నించిన ఘటనలో 11 మందిపై కేసు నమోదు చేశారు. అందులో8 మందిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జుక్కల్​లో మాల్​ ప్రాక్టీస్​కు యత్నించిన ఘటనలో 11 మందిపై కేసు నమోదైనట్లు చెప్పారు. అయితే వీరిలో ముగ్గురు పరారీలో ఉండగా అరెస్టు చేసిన ఎనిమిది మందిలో ఇద్దరు విలేకరులు కూడా ఉన్నారని తెలిపారు. జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రంలో గణితం పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థికి సబ్జెక్టు సరిగ్గా రాదు. దీంతో విద్యార్థి తండ్రి పాఠశాలలో వాటర్ సప్లయ్ చేస్తున్న ఓ వ్యక్తిని మాటలతో మచ్చిక చేసుకున్నాడు. అతనికి ఓ తెల్ల కాగితం ఇచ్చి తన కొడుకు వివరాలు చెప్పి ప్రశ్నలను రాసుకుని రావాలని పంపించాడు. తెల్ల కాగితాన్ని సదరు వ్యక్తి విద్యార్థికి ఇచ్చాడు. కాసేపటికి 5 ప్రశ్నలతో కూడిన కాగితాన్ని ఆ విద్యార్థి సదరు వ్యక్తికి అందించాడు. అతను ఆ కాగితాన్ని తిరిగి విద్యార్థి తండ్రికి ఇచ్చాడు.

అనంతరం విద్యార్థి తండ్రి ఆ పేపర్​ను గ్రామ పంచాయతీ కారోబార్​కు ఇచ్చి జవాబులు తేవాలని తెలిపారు. ఆ పేపర్​ను ఫొటో తీసుకున్న కారోబార్​ అక్కడే ఉన్న విలేకరికి పంపించాడు. అలాగే ఆ పేపర్ కారోబార్​ నుంచి ఓ యూట్యూబ్ రిపోర్టర్​కు చేరగా ..అతని నుంచి మరో రిపోర్టర్​కు వాట్సాప్​లో పంపారు. సదరు విలేకరి ఆ పేపర్​ను ఓ క్లిప్పింగ్ తయారు చేసి లోకల్​గా ఉన్న డిజిటల్ మీడియా గ్రూపులో షేర్ చేశాడు. తర్వాత ఓ మైనర్​ బాలుడు పరీక్ష కేంద్రానికి వెళ్లి మరొక మైనర్​ బాలుడి ఫోన్​ నుంచి ప్రశ్నలతో కూడిన పేపర్​ను ఫొటో తీసి కారోబార్​కు పంపించి డిలీట్ చేశారు. పోలీసులు ఈ విషయాన్ని గుర్తించి ప్రశ్నలు బయటకు వెళ్లకుండా విచారణ చేపట్టి ఆరుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. కాగా ఓ యూట్యూబ్​ ఛానల్​ విలేకరితో పాటు వాట్సప్​ గ్రూప్​ అడ్మిన్​, మరో మైనర్​ బాలుడు పరారీలో ఉన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఎస్​బీ సీఐ తిరుపతి పాల్గొన్నారు.

Next Story

Most Viewed