‘ఆ నెమళ్ళు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి’

by Gantepaka Srikanth |
‘ఆ నెమళ్ళు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ‘నెమళ్ళు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. లేళ్లకు నిలువ నీడ లేకుండా చేస్తున్నరు. చెట్లను నరికి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నరు’ అని కంచ గచ్చిబౌలిలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. దాశరథి శత ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ జాగృతి రూపొందించిన ‘ఆ చల్లని సముద్ర గర్భం’ దృశ్యగీతాన్ని హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో తెలంగాణలో 7.7 శాతం అడవులు పెరిగాయని, ఇప్పుడు రాష్ట్రంలో చెట్లను పీకేసే పరిపాలన సాగుతున్నదని తెలిపారు. ఈ ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా తెలంగాణ నేలమీద మరో ఉద్యమం జరుగుతున్నదని, ఈ ఉద్యమంలో ప్రజలంతా, విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.


ప్రస్తుతం తెలంగాణ సోయితో పరిపాలన జరగడం లేదనీ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, సరస్వతి పరిషత్ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, కవి, రచయిత కాంచనపల్లి గోవర్ధన్ రాజు, జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివ శంకర్, పాత్రికేయుడు పరాంకుశం వేణుగోపాల స్వామి, రచయిత మిట్టపల్లి సురేందర్, సింగర్ మానుకోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed